1980లో అయిలమ్మతో ముఖాముఖి..
.
తెలంగాణ పోరాట వీరనారి అయిలమ్మను నేను 1980లో సూర్యాపేటలో మహిళా మహాసభల సందర్భంగా కలుసుకోగలిగాను. చాలా దశాబ్దాల తర్వాత ఆమె బయిటకు వచ్చిన సభ అది. వెళ్లి నమస్కారం పెడితే పెద్దరికంగా పలకరించింది. పెద్దదాన్నయిపోయిన అంటూ కొంత నిర్వేదం కనపరచింది. ఇప్పుడు ప్రతిచోటా వాడే ఫోటో అప్పుడు తీసిందే.ఆ సభలకు ఆజాద్ హింద్ ఫౌజ్ కెప్టెన్ లక్ష్మీసెహగల్ కూడా వచ్చారు. నేను ఆమె అనువాదకుణ్ణి. అప్పుడు ఎంఎల్ఎగా వున్న వీర వనిత మల్లు స్వరాజ్యం సభ నడిపించారు.పోరాట కాలంలో నిజాం ప్రజాశక్తి పత్రికను నిషేదించారు. వ్యక్తిగతంగా నేనైతే 60 వార్షికోత్సవ కమిటీ కన్వీనర్గానూ అప్పుడు వెలుబడిన పుస్తకాల సంపాదకుడుగానూ సాధారణ తెలంగాణ యోధుల గాధలు వెలికి తీసి ప్రచురించడంచాలా సంతోషం కలిగించింది.వీర తెలంగాణ మాది అన్న పుస్తకం మొదటి సారి చాలామంది ప్రత్యక్ష గాధలను వెలికి తీసింది. ఎందరో వీరులను వీర వనితలను పిలిపించి సత్కారించడంతో ఆ ఉత్సవాలు సార్థకమైనాయి. దొడ్డి కొమరయ్యపై తొలి పుస్తకం తీసుకొచ్చింది కూడా ప్రజాశక్తి ద్వారానే. వరంగల్కు చెందిన మిత్రుడు రమేష్ దాన్ని రాశారు. కొమరయ్య ఫోటో లేకున్నా ఆయన అన్నలాగా వుంటారన్న సమకాలీకుల జ్ఞాపకాల ఆధారంగా ఆయన బొమ్మ గీయించాడు రమేష్. టిఆర్ఎస్ తొలి దశలో గాని అంతకు ముందు కమ్యూనిస్టేతరులు గాని అయిలమ్మను కొమరయ్యను తల్చుకున్న దాఖలాలు లేవు. వారి బొమ్మలూ విగ్రహాలూ వుండేవి కావు. ఇప్పటికైనా గౌరవంగా తల్చుకోవడం బాగానే వుంది గాని జులై4,సెప్టెంబరు 17 వంటి తెలంగాణ పోరాట ఘట్టాలను కూడా ఘనంగా నిర్వహించడం టిఆర్ఎస్ ప్రభుత్వకర్తవ్యం. ముఖ్యమంత్రిగా కెసిఆర్ తొలిసారి మీడియా ముఖ్యులను కలుసుకున్నప్పుడు ఆ పోరాటాన్ని గ్లోరిఫై చేయాలని చెబితే నిజమే చేయాలి అని అంగీకరించారు. కాని ఆచరణలో జరక్కపోవడం విచారకరం. ఆ వారసత్వాన్ని గౌరవించడం ప్రభుత్వ ధర్మం,బాధ్యత.
