నమ్మకస్తులకు మన్నన
రకరకాల రాజకీయ వివాదాల్లో రాష్ట్రం మునిగివున్న తరుణంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సాదాసీదాగా మూడు నియామకాలు చేశారు. తద్వారా నమ్మకస్తులను తాను ఎప్పుడూ మనసులో వుంచుకుంటాననే సంకేతం ఇచ్చారు. వాస్తవానికి వారిలో ఒకరిద్దరితో అంతకు ముందు రోజు మాట్లాడినప్పటికీ ఇలాటి నిర్ణయం రాబోతుందని వారికే తెలియదు. సీనియర్ ఎంఎల్సి పాతూరి సుధాకరరెడ్డిని చీప్ విప్గా నియమించడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది గాని అత్యున్నత స్థాయిలో మొదటి నుంచి అనుకుంటున్నారట. వేరే సూచనలు సలహాలు వచ్చినా నేను ఆయనకు ఇవ్వడం ధర్మం అని కెసిఆర్ గట్టిగా సమాధానమిచ్చినట్టు సమాచారం. ఇక విప్గా నియమితుడైన పల్లా రాజేశ్వరరెడ్డి చాలా రోజులుగా ముఖ్యమంత్రికి విశ్వసనీయులుగా వుంటూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్వతహాగా విద్యా సంస్థల యజమానిగా వనరులు సమీకరించి బృహత్ సమ్మేళనాలు జయప్రదం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బోడిపాటి వెంకటేశ్వర్లు గతంలో తెలుగుదేశంలో ఎంపిగా చేసి టిఆర్ఎస్లో ఎంఎల్సి అయ్యారు. ఈ ముగ్గురూ టీవీ చర్చలకు వచ్చేవారు కావడం విశేషం. గతంలో చర్చలకు వచ్చే కొందరు ఎంఎల్సిలయ్యాక దాదాపు రావడమే మానేసిన స్థితిలో ఇదో ప్రత్యేకతగా చెప్పొచ్చు. పదవులకు సంబంధించిందే అయినా అంతర్గతంగా కెసిఆర్ పై సన్నిహితుల నమ్మకం పెరగడానికి ఇలాటి నిర్ణయాలు దోహదం చేస్తాయి.
