ఉద్రిక్త’న్యాయంలో ఉచితానుచితాలు
తెలంగాణ న్యాయాధికారుల నియామకంలో అన్నాయం జరిగిందంటూ ఆందోళనకు దిగిన వారిపై హైకోర్టు సస్పెన్షన్లవరకూ వెళ్లడం అసాధారణ పరిణామం. సామరస్యంగా పరిష్కరించుకోవడం, వారి ఆవేదిన ఆర్థం చేసుకోవడం ముఖ్యం. విభజన అంటూ జరిగిన తర్వాత హైకోర్టు తరలిపోక తప్పదు. ఎపి హైకోర్టు విషయమై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన ఏమిటో ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నదో చెప్పడం లేదు. వారు తేల్చుకునేలోగా హైదరాబాదులోనే విడిగా ఏపిహైకోర్టు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ సూచించింది. అయితే ఒకసారి విడగొట్టిన తర్వాత మరో రాష్ట్ర భూభాగంలోనే దాన్ని కొనసాగించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కేంద్రం కూడా ఈ విషయంలో తన పాత్ర పరిమితమని చెబుతున్నది. ఇలాటప్పుడు న్యాయవాదులు న్యాయాధికారులు కూడా కొంతకాలం సంయమనం వహించడం తప్ప ఉద్రిక్తతలు ఉద్రేకాలు పెంచుకోవడం మంచిది కాదు. విభజనే జరిగిన తర్వాత ఇతర అంశాలు వాటికవే తేలిపోకతప్పదు. అయితే టిఉద్యమంలో న్యాయవాదులు చాలా ఆవేశపూరిత పాత్ర పోషించారన్నది నిజం. హైకోర్టులో పోటీల కారణంగా విభేదాలు తీవ్రంగా వున్నమాట నిజం. ఇక కింది స్థాయి న్యాయమూర్తుల నియామకంలోతమకు అన్నాయం జరుగుతున్నదని కూడా తెలంగాణ వాదులు నిరంతరం వాదిస్తున్నారు. ఇప్పుడు చేసిన నియామకాల్లో కూడా ఆంధ్ర ప్రాంతం వారికి అన్నీ కట్టబెట్టారని జెఎసి తరపున ఆందోళన చేస్తున్నారు. 125 మంది న్యాయమూర్తులు జెఎసికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. హైకోర్టు తరలింపునకూ జిల్లాల్లో నియమకాలకు మధ్య తేడాను గమనించడం అవసరం. సమస్య ఏమంటే రాజ్యాంగంలో స్థానికత నిర్వచనం ప్రకారం ఇకముందు కూడా ఇలాటి సమస్యలు రావచ్చు. హైకోర్టు విభజన తర్వాత కూడా దేశంలో ఎక్కడినుంచైనా వచ్చి వాదించవచ్చు. కనుక దీన్ని జీవన్మరణ పోరాటంగా తీసుకుని కిరోసిన్ పోసుకునే వరకూ వెళ్లడం దురదృష్టకరం. వ్యక్తులుగా ఎవరికి ఏ నియామకాలు దక్కాయి, ఏ కులం ఆధిక్యతలో వుంది వంటి విమర్శలు వున్నాయి గాని రేపైనా అలాటివి వుండనే వుంటాయి. ఆవేశంలో వారు ఆందోళన చేస్తే లేక తమ సంఘానికి రాజీనామా పత్రాలు సమర్పించి గవర్నర్ను కలిస్తే హైకొర్టు మొదట ఇద్దరిని ఈ రోజు ముగ్గురు జడ్జిలలను సస్సెండ్ చేయడం అనాలోచిత చర్య. ఇంతకంటే వారితో సంప్రదింపులు జరిపి నచ్చజెప్పడం మంచిది. నియామకాల వరకూ ఏవైనా నిర్దిష్ట నిర్ణయాలు వుంటే చేయొచ్చు.హైకోర్టు తరలింపుపై చర్చలు జరపొచ్చు. ఉత్తర భారతంలోనూ గుజరాత్ ముంబైల ల మధ్యనా పాత హైకోర్టులే చాలా కాలం కొనసాగాయి.ఈశాన్య రాష్ట్రాలకు ఒకే హైకోర్టు వుంటుంది. పదేళ్లు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు రెండేళ్లలోనే హడావుడిగా తరలించుకుపోలేదని సంఘర్షణలు పెంచుకోవడం అవసరం లేనిపని. తెలుగుదేశం న్యాయవ్యవస్థ మొత్తం గుప్పిట్లో పెట్టుకుంటుందని ఒకటికి రెండుసార్లు ఆరోపించడం న్యాయమూర్తులను శంకించడమే.తీర్పులు తప్పయితే సవాలు చేయొచ్చు. నియామకాలు తప్పయితే కోర్టుకు వెళ్లొచ్చు.అంతేగాని కేవలం ఆవేశాల ఆధారంగా ఆత్మాహుతి ప్రయత్నాల వరకూ వెళ్లడం విజ్ఞులైన న్యాయవాద సోదరులకు తగదు. దీనిపై ఢిల్లీలో ధర్నాచేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజమైతే – రాజకీయ కోణమే ఎక్కువని చెప్పాల్సివస్తుంది. ఈ నియామకాల జాబితా ఆయనకు తెలియకుండానే రూపొందిందా? ముందే ఎందుకు అడ్డుకోలేదు?ఎన్నో పెద్ద సమస్యలపై ప్రజలు పోరాడుతుంటే ఎదురుదాడి చేస్తున్నవారు ఈ సమస్యపై మాత్రం ధర్నావరకూ వెళ్లడం వెనక ఏ వ్యూహం వుందనే ప్రశ్న వస్తుంది.కేంద్ర న్యాయశాఖా మంత్రి సదాశివగౌడ ధర్నా యోచనను విమర్శిస్తూనే సమస్య తమ చేతుల్లో లేదంటున్నారు. టిడిపితో కలసి పాలన పంచుకుంటున్న వారు ఎందుకు చొరవ తీసుకోరు? ఎందుకొక రోడ్ మ్యాప్ ప్రకటించరు?
ఏది ఏమైనా కీలకమైన విభజన పూర్తయిన తర్వాత కాస్త ముందు వెనకగా జరగవలసిన ఇతర అంశాలపై మరీ ఆవేశాలకు ఉద్రేకాలకు లోనవడం పరస్పర ఆరోపణలు చేసుకోవడం మంచిది కాదు. హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి కూడా శిక్షణా చర్యలు విరమించి చర్చలు చేపట్టడం మంచిది.