పదవి ప్రమాదంలో ఆప్ నేతలు, మంత్రి రాజీనామా
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని , కాంగ్రెస్ను చిత్తుచేసి రెండుసార్లు ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అంటే చాలా మందికి ఇష్టం. దేశ రాజకీయాల్లో మార్పుకు ఆప్ ఒక మార్గం చూపిందని కూడా భావిస్తుంటారు. అయితే హడావుడి నిర్ణయాలతో అరకొర చర్యలతో ఆప్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేజ్రివాల్ సంక్షోభాల్లో చిక్కుకుపోతుంటారు. 2015లో ఢిల్లీ శాసనసభ ఆమోదించిన బిల్లుపై అధికార ముద్ర వేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నిరాకరించడంతో 21మంది పాలకపక్ష ఎమ్మెల్యేలు అనర్హత పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. నిబంధనల ప్రకారం శాసనసభ్యులు లాభదాయకమైన పదవుల్లో ఉండేందుకు వీల్లేదు. కానీ ఆప్ ప్రభుత్వం 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. వారందరికీ మంచి ప్రతిఫలం కూడా నిర్ణయించింది. మంత్రులు ఆరుగురే అయినా 21 మంది ఈ విధంగా పదవులు పొందడం కోర్టు తీర్పుల ప్రకారం ఇబ్బందికరంగా మారింది. వారిని వేటు నుంచి కాపాడేందు కోసం 2015 అనర్హతల మినహాయింపు బిల్లు తీసుకువచ్చారు. ఆ మేరకు 1997నాటి చట్టాన్ని సవరించారు. అయితే రాష్ట్రపతి ఈ బిల్లును తిప్పి పంపడంతో ఇప్పుడు వారందరూ జోడు పదవులు అనుభవిస్తున్నందుకు అనర్హత పాలవకుండా ఎలా కాపాడుకుంటారో చూడాల్సిందే!.
రవాణా మంత్రి రాజీనామా
ఇదిలా ఉంటే ఢిల్లీ రవాణాశాఖా మంత్రి గోపాల్ రారు ఏకంగా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రీమియర్ బస్సులను ప్రవేశపెట్టాలన్న ఆయన పథకంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆప్ నాయకత్వం దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజ్రీవాల్కు ఈ పరిణామం ఇబ్బందికరంగానే మారనుంది. ఈ సమయంలోనే ఆయన తానంటే ప్రధాని మోడీకి భయం అంటూ వ్యాఖ్యానించడం ఆసక్తికరం.

