సాక్షి సత్వర స్వాధీనం సాధ్యం కాదు

saxi photo
రేపో మాపో సాక్షి పత్రికను చానల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన ఇప్పుడున్న చట్టాల ప్రకారమైతే సాధ్యమయ్యేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక కోర్టులచట్టం 2015 రాష్ట్రపతి ఆమోదం పొందడానికి సాక్షి స్వాధీనానికి సంబంధం లేదు. 2002 మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ కింద ఆస్తుల అటాచ్‌మెంట్‌ అంటే అర్థం వాటిపై ఎలాటి లావాదేవీలు బదలాయింపులు జరక్కుండా కట్టడి చేయడం మాత్రమే తప్ప జప్తు(కన్ఫిస్కేషన్‌) కాదు. చట్టం చాప్టర్‌ 111 సెక్షన్‌2(1)డిలో ఇందుకు సంబంధించి చాలా సమగ్రమైన వివరణ వుంది. జగన్‌పై నడుస్తున్న అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చాలా కాలం కిందటే సాక్షి ఆస్తులు కట్టడి చేసింది. నిర్వహణను అనుమతించడమే గాక ఆ మేరకు నిధుల విడుదలను కూడా అమలు చేస్తున్నది.ఆయనపై వున్న కేసుల విచారణ పూర్తయి, నేర నిర్ధారణ జరిగి అది అత్యున్నత న్యాయస్థానంలోనూ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఈ ఆస్తుల సమస్య ముందుకొస్తుంది.ఆ అంతిమ తీర్పులో ఈ ఆస్తులను ఏం చేయాలన్నది నిర్దిష్టంగా చెప్పవలసి వుంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా జప్తు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడతాయి. అప్పుడైనా ప్రత్యేక కోర్టు తీర్పు వచ్చాకనే అడుగు ముందుకేయడం సాధ్యం తప్ప ఏకపక్షంగా ఏమీచేయడానికి వుండదు.
ప్రత్యేక కోర్టుల కోసం నోటిఫికేషన్‌, నియామకం,దాని ముందుకు ఈ కేసు పత్రాలు నివేదించడం, అక్కడ మళ్లీ అంతిమ తీర్పు ఇన్ని దశలుండగా రేపో మాపో స్వాధీనం చేసుకోవడం గురించి యనమల వంటి అనుభవశాలి మాట్లాడుతున్నారంటే రాజకీయ హెచ్చరికగానే తీసకోవలసి వుంటుంది. జగన్‌ ఆయన పార్టీ నేతలు కాకున్నా అభిమానులు ఇతరులపై దీని ప్రభావం వుంటుందని తెలుగుదేశం వ్యూహం కావచ్చు. సాక్షి దాడి తీవ్రత తగ్గిద్దామన్న ఆలోచనా వుండొచ్చు. ఏమైనా జగన్‌పై ఆరోపణలనూ సాక్షిలో వ్యతిరేక కథనాలు ప్రచురణను కలగాపులగం చేయడం సరికాదు. ప్రభుత్వమే పత్రికను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన కూడా సమంజసం కాదు.ప్రాథమిక ఆధారాలతో కట్టడి చేసుకున్న ఆస్తులను గనక అమ్మడం మొదలు పెడితే తర్వాత తుది తీర్పు మరో విధంగా వస్తే ఏం చేస్తారు?
అధికారంలో వున్నవారికి మీడియాలో విమర్శలు వ్యతిరేక కథనాలు రుచించవు.వైఎస్‌ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆ రెండు పత్రికలు అనేది వూతపదంగా వాడేవారు. టిఆర్‌ఎస్‌ టిడిపిలు కూడా ప్రతికూల పత్రికలు ఛానళ్లపై విరుచుకుపడటం అలవాటు చేసుకున్నాయి. రాజకీయంగా ఏదైనా చేయొచ్చునేమో గాని చట్ట ప్రకారం మాత్రం అటాచ్‌మెంట్‌లో వున్న సంస్థలన్నీ గుప్పిట్లోకి తీసుకోవాలనుకోవడం కుదిరేపని కాదు. దీనివల్ల మీడియా స్వేచ్చను కాపాడాలనే నినాదం ముందుకు రావడం తప్పనసరి.జయలలిత కేసులో శిక్ష పడి కూడా తర్వాత కొట్టివేయడం చూశాం. అలాటప్పుడు ఆమె ఆస్తులను ముందే తీసేసుకుని వుంటే ఏమయ్యేది?వ్యతిరేక వార్తలువస్తున్నాయనే పేరుతో గనక స్వాధీనం చేసుకోవాలనుకుంటే అప్పుడు మరింత విస్త్రతమైన నిరసన వస్తుంది.అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అసెంబ్లీలో రభస తప్ప జగన్‌పై ఒక్క ఆరోపణను ప్రభుత్వం అదనంగా ఫిక్స్‌ చేసింది లేదు. కనక బెదిరింపులకు తప్ప ఆచరణకు ఈ హెచ్చరికలు అక్కరకు రావు. నిజంగా ఆ కేసులు త్వరగా తేలిస్తే ఎవరికీ అభ్యంతరం వుండనవసరం లేదు.

2 thoughts on “సాక్షి సత్వర స్వాధీనం సాధ్యం కాదు

  • June 9, 2016 at 11:42 pm
    Permalink

    ఇలా అన్ని ఆయన కు నచ్చని నిజాలు చెబితే మరో కొమ్మినేని అవుతారేమో…..అసలే ప్రభువులకి ప్రజస్వామ్యం మీద నమ్మకం ఎక్కువ…!

    Reply
  • June 10, 2016 at 9:52 am
    Permalink

    మా చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని ఒరే దున్నపోతు ఈనింది రా అంటే దూడను కట్టండి రా అన్నాడట ,ఇలా ఉంది ఈ పాలకుల నోటి దూల , మొన్నటికి మొన్న అసెంబ్లీ లో మేం ఏమైనా చేస్తాం ,దేశం లో ఎ కోర్ట్ లు మమ్ముల్ని తప్పు పట్టలేవు ,మా తీర్ప్ కు తిరుగు లేదు అనే అహంకారం తో ఉన్నారు పాలకులు , నా ఉద్దేశ్యం లో సుప్రీం కోర్ట్ నాయముర్తి / ప్రెసిడెంట్ అఫ్ ఇండియా కుడా నా తీర్ప్ కు తిరుగులేదు అనరు ,అనలేరు కాని వెన్నుపోటు ఆరాచక పలానా చక్రవర్తులు ఏదైనా చెయ్యగలరు , తెలంగాణా లో ఒక ఛానల్ ప్రసారాలు ఆపేస్తే అరచి ఘీ పెట్టిన వారే ఒక చానెల్ ఉద్యోగి పొట్టమీద కొట్టి ఆంద్ర లో ఛానల్ ఆపేస్తే కర్రెక్ట్ అంటారు అంటే వారు చేస్తే సంసారం పక్కవాడు చేస్తే వ్యభిచారం

    Reply

Leave a Reply to రామ రావు Cancel reply

Your email address will not be published. Required fields are marked *