భజరంగ్దళ్ ‘భయానక’ శిక్షణ

విహెచ్పి, దానికి అనుబంధమైన భజరంగదళ్ ఉత్తరప్రదేశ్లో మరోసారి ఉద్రిక్తత సృష్టించేందుకు సిద్ధమవుతున్న వాస్తవం సాక్ష్యాధారాలతో తేలిపోయింది. అనేక అనర్థాలను చూసిన అయోధ్యలో భజరంగదళ్ టెర్రరిస్టులను ఎదుర్కొనే శిక్షణ పేరుతో కత్తులు కటార్లు తుపాకులు తీసుకుని మరీ విన్యాసాలు చేస్తున్నది. ఇదంతా విడియోలో దొరికి, పోలీసులు కేసు పెట్టిన తర్వాత కూడా మొండిగా సమర్థించుకుంటున్నది. ముస్లిం టెర్రరిస్టులను ఎదుర్కొనేందుకై ఆత్మవిశ్వాసం కలిగించేందుకు ఆయుధాలతో శిక్షణ ఇస్తే తప్పేమిటని ఎదురుదాడి చేస్తున్నారు విహెచ్పి ప్రధాన కార్యదర్శి సురేంద్రజైన్. ఈ విషయమై పోలీసులు శిక్షణ నిర్వాహకులు మహేష్ శర్మపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే ఆయుధాలతో శిక్షణ మా హక్కని బాలరాజ్ దర్బాల్ రెచ్చిపోయారు. సిక్కులు కృపాణాలతో తిరగొచ్చు గాని మాకు హక్కులేదా అంటున్నారు. దీనిపై మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నా బిజెపి నేతలెవరూ స్పందించింది లేదు. ఈ లోగా నోయిడాలోని సరస్వతీ శిశు విద్యామందిర్లోనూ 16 జిల్లాల నుంచి వచ్చిన 400 మందికి ఇదే విధమైన శిక్షణ తతంగం మొదలైంది. వీరంతా 15 నుంచి 25 ఏళ్ల లోపు వారు.ఇంత పసి వయస్సులో వారి మనసులలో విద్వేషంనూరిపోస్తే దాని పర్యవసానాలు ఎలా వుంటాయి? యుపి శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలంటే గతంలో వలెనే మొత్తం సంగ్ పరివారాన్ని రంగంలోకి దింపాలని భావించినట్టు కనిపిస్తుంది.