పుస్తకాలు చిరంజీవులే!

నవోదయ రామమోహనరావు తమ ప్రముఖ ప్రచురణ సంస్థను మూసివేస్తున్నట్టు ప్రకటించిన ఇంటర్వ్యూ వచ్చాక చాలామంది పుస్తక ప్రేమికులు సాహిత్యాభిమానులు ఒక విధమైన ఆందోళనకు విచారానికి గురవుతున్నారు. వాస్తవం ఏమిటంటే పుస్తకాల పరిస్థితి అంత అధ్వాన్నంగా ఏమీ లేదు. నిజానికి ప్రోత్సహకరంగానే వుంది. మంచి పుస్తకాలు, ప్రజలకు అవసరమైన ఆసక్తికరమైన లేదా ప్రతిభావంతమైన రచనలు ఆదరణ పొందుతూనే వున్నాయి. కేవలం కాలక్షేప సాహిత్యం అందులోనూ అప్రసిద్ధులు రాసే సాదాసీదా రచనలు ఎవరూ చదవడం లేదు.కొత్తతరం పాఠకులకు కాలక్షేపం కోసం నవలలు చదవాల్సిన అవసరం వుండటం లేదు. ముఖ్యంగా దేశీయ భాషల్లో. ఇంగ్లీషులోనైతే దేశ విదేశీ రచనలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి. చేతన్ భగత్ వంటి రచయితలు వెలుగుతూనే వున్నారు.
తెలుగులో ప్రజాశక్తి,విశాలాంధ్ర, ఇప్పుడు తెలంగాణలో వాటి ప్రతిరూపాలైన నవతెలంగాణ,నవ చేతన ప్రచురణాలయాలు, ఎమెస్కో, హైదరాబాద్ బుక్ట్రస్ట్ పర్స్పెక్టివ్స్ వంటి ప్రత్యేక ధోరణి గల సంస్థలు పీకాక్ క్లాసిక్స్ వంటి ప్రయత్నాలు, జూలురు గౌరీ శంక
ర్ తెలంగాణ పుస్తకాలు , పాలపిట్ట ప్రచురణలు ఇలాటివి నడుస్తూనే వున్నాయి. ఇంకా చెప్పుకోవలసిన చొరవలు చాలా వున్నాయి.నిజానికి హైదరాబాద్, విజయవాడ పుస్తక ప్రదర్శనలు అంతకంతకూ విస్త్రతమవుతూ నూతన తరాలను ఆకర్షిస్తున్నాయి.జాతీయంగానూ జైపూర్ లిటరరీ ఫెస్టివల్తో సహా 60 నడుస్తాయి. రచయితలు అనువాదకుల కొరత వుందని చెప్పాలి.
కాల్పనిక సాహిత్యం కొనడం తగ్గిన మాట నిజం. దానికి కారణం విపరీతంగా విస్తరించిన టీవీ మీడియా సెల్ఫోన్లోనే అన్నీ చూడగలుగుతున్నప్పుడు కథలు నవలలు చదవడం బాగానే తగ్గింది.అయితే నాన్ఫిక్షన్ మరింత ఆదరణ పొందుతున్నది.. వ్యక్తిత్వ వికాసం,బాలసాహిత్యం,, నూతన ధృక్కోణంతో చరిత్ర, దళిత స్త్రీవాద సాహిత్యాలు జీవిత చరిత్రలు ఇవన్నీ రానురాను మరింత ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. కెరీర్ చదువుల కోసమైనా సరే యవత విస్తారంగా పఠిస్తున్నది. నా అనుభవం చెప్పాలంటే శ్రీశ్రీ జయభేరి, భగత్ సింగ్ వంటి పుస్తకాలు మూడు నాలుగు ముద్రణలు పొందాయి. ఒకరోజు స్కూటర్పై వెళ్తుంటే వెనగ్గా వచ్చిన యువకులు నా వెయ్యేళ్ల చరిత్ర తమ గ్రూపు పరీక్షలకు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.ఐపిఎస్ ప్యాసైనకుర్రాడి పెళ్లికి వెళితే వేదికపైనే చదివిన పుస్తకాల గురించి చెబుతున్నాడు. ఇన్ఫర్మేషన్ లేదా ఇన్స్పిరేషన్ వున్న పుస్తకాలు అప్పుడూ ఇప్పుడూ పోతున్నాయి.
అయితే మార్పే లేదా అంటే వుంది. మిగిలిన షాపుల్లాగే పుస్తకాల షాపులు కూడా నడవక పోవచ్చు.హైదరాబాదులో ఎఎహుస్సేన్, ముంబాయిలో లాండ్మార్క్, ఢిల్లీ కన్నాట్ ప్లేస్లో గ్గాగోటా సన్స్ వంటి అనేకం మూతపడ్డాయి. నిజమే. కాని దానికి అనేక కారణాలున్నాయిఆన్లైన్ అమ్మకాలు మొదటి మార్పు. ఆ కారణంగా పుస్తక శాలల విక్రయాలపై ప్రభావం పడుతున్నది గాని ప్రచురణపై కాదు. అలాగే కూచుని చదివేందుకు కాఫీ టీలు తాగేందుకు చర్చిచుకోవడానికి కూడా పుస్తక కేంద్రాల్లో వసతులు కల్పించే దశ.పట్టణాలు నగరాల్లో కొత్త తరహా రీడింగ్ రూములు పునర్ధర్శనమిస్తున్నాయి.. గ్రంథాలయాల్లో కెరీర్కోసమైనా సరే యువతీయువకులు వందల మంది చదివేస్తున్నారు.
ఇటీవల మలాల జీవితం పుస్తకం ప్రచురించి కళాశాల విద్యార్థినులందరికీ కాపీ ఇచ్చి మరుసటి రోజు చెప్పమన్నారు. ఒకేసారి 3000 కాపీలు తీసుకున్నారు. ఇలాటి ఉదాహరణలు అనేకం.
రచయితల దృష్టి ప్రచురణకర్తల దృష్టి మారాలి. ప్రజల అవసరాలకు పరిణామాలకు తగిన సాహిత్యం సృష్టించి వారికి చేరువగా తీసుకువెళ్లాలి. ప్రజల దగ్గరకు పుస్తకాలు అన్నది నినాదం తప్ప పుస్తకాల షాపుకే వచ్చి తీరిగ్గా చూసి తీసుకోవడం తగ్గింది. ఇంకా తగ్గుతుంది. అది పాఠకుల తప్పు కాదు
.