బెంబేలెత్తిస్తున్న బెంగాల్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరాటం మొదలు కాకముందు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు వుండదనే అందరూ అనుకున్నారు. కాని సిపిఎం వామపక్షాలు గట్టి వ్యూహం తీసుకోవడం, కాంగ్రెస్తో పోటీలు నివారించుకోవడం పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసింది.ఈ సమయంలోనే ఆ పార్టీ ఎంఎల్ఎలు ఎంపిలు మంత్రుల నిజస్వరూపం బయిటపెట్టే నారద స్ట్రింగ్ ఆపరేషన్తో మమత ప్రభుత్వం కుదేలైపోయింది. పులిమీద పుట్రలా ఫ్లైఓవర్ ప్రమాదం ఇంకా ఇబ్బందులలో పెట్టింది. 2011 ఎన్నికలకు ముందు బడా మీడియా మమతా బెనర్జీ అవినీతికి అతీతంగా వుంటారనే ఒక భ్రమను ప్రచారంలో పెట్టింది. దానికి తగినట్టే ఆమె వేషభాషలసు కూడా ప్రజలకు దగ్గరగా వుంటాయని పేరొచ్చింది. మూడున్నర దశాబ్దాల వామపక్ష ప్రభుత్వ పాలన నుంచి పరివర్తన జరగాలనే పిలుపు ఈ నేపథ్యంలోనే గట్టిగా పనిచేసి తృణమూల్ అధకారంలోకి రాగలిగింది. అయితే పూర్తిగా అధికారంలో కుదురుకోకముందే శారదా చిట్ఫండ్స్ వ్యవహారం ఆ ప్రభుత్వాన్ని మొదలంటా కుదిపేసింది. మదన్గుప్తాతోసహా ఎందరు జైలుకు పోయారో చెప్పడానికి లేదు. దాంతోనే నైతిక బలం కోల్పోయిన మమత ఇదంతా వామపక్ష ప్రభుత్వ హయాంలో జరిగిందని ఎదురుడాడికి విఫలయత్నం చేసింది. సంగతేమంటే వామపక్ష ప్రభుత్వం పలుసార్లు దీనిపై కేంద్రం దృష్టికి తె చ్చి వుంది. శారద టు నారద అన్నది ఇప్పుడు బెంగాల్లో ఒక నినాదంగా వుంది. రైల్వే మంత్రిగా వున్నప్పుడు కూడా మమతా బెనర్జీ అనేక అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారని వామపక్షాలు చెబుతూనే వచ్చాయి. అయినా కేంద్రంలోని బిజెపి కాంగ్రెస్లు సరైన చర్య తీసుకోలేదు.శారద నారద వుదంతాలలో అనివార్యంగా ఆమె సంజాయిషీ చెప్పుకోవలసిన స్థితి ఏర్పడింది. స్రింగ్ ఆపరేషన్ కుట్ర అని ఆమె గగ్గోలు పెట్టినా పట్టించుకునే వారు లేరు. పైగా ఆ పార్టీ ఎంపి ముకుల్ రారు వంటివారే దీనిపై భిన్న స్వరం వినిపించడం విశేషం.ఇక్కడే వామపక్ష ప్రభుత్వానికి మమత పాలనకు తేడా ఏమిటో ప్రజలకు స్పష్టమై పోయింది. 34 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకపోగా మమతా కూడా ఇప్పటివరకూ ఎలాటి కొత్త ఆరోపణలు తీసుకురాలేకపోయారు. ఇందుకు భిన్నంగా కొద్ది కాలంలోనే ఆమె ప్రభుత్వం కుంబకోణాల పరంపరలో కూరుకుపోయింది.
ఇదేగాక ప్రతిపక్షాలపైదాడులు, తనను విమర్శించిన రచయితలు కార్టూనిస్టులు అధ్యాపకులు ప్రతివారిపైనా దాడి మమత పట్ల విముఖత పెంచాయి. అయినా స్థానిక ఎన్నికల నాటికి విపరీతమైన మాఫియా తరహా దౌర్జన్యంతో తృణ
మూల్ ప్రతిపక్షాలకు ఓటు వేసే అవకాశం లేకుండా చేసింది. ఈ పూర్వరంగంలోనే సిపిఎం ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూడాలనే వ్యూహం స్వీకరించింది. దీనిపై విమర్శలకు ఫలితాలే జవాబు చెబుతాయి. ఈ ప్రచార సందర్భాన్ని ఉపయోగించుకుని సిపిఎం కార్యకర్తలు గ్రామాల్లో అధికార పార్టీ ఆక్రమించిన తమ కార్యాలయాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోగలిగారు. దీనివల్ల అభిమానుల్లో సాధారణ ప్రజల్లో వివపరీతమైన ఆత్మ విశ్వ్ణాసం పెరిగింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పుడు సర్వేలు గాని మీడియా వ్యాఖ్యాతలు గాని ఏకపక్షంగా చూడటం లేదు. వామపక్షాలు కాంగ్రెస్నుంచి పాలక పక్షం గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్టే అవి రాస్తున్నాయి. ఉదాహరణకు సోమవారం ఈనాడు పత్రిక ఎడిట్ పేజీలో సిద్దార్త సర్కార్ ఇదే తెలిపారు. మింట్ పత్రికలో అనేక్ పాల్ రాస్తూ ‘మమత విజయంనల్లేరుమీద నడక కాదు’ అని శీర్షికనిచ్చారు.మొదట్లో పాలకపార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందనుకున్నా మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. హిందూ, హిందూస్థాన్ టైమ్స్ వంటి పత్రికలన్నీ ఈ తరహాలోనే వ్యాఖ్యానించాయి. కనుక తృణమూల్ పాలన ఏకదఫా వ్యవహారంగా ముగిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వామపక్షాలు ఓటమి తర్వాతి ఎన్నికల్లోనే ఇంత బలంగా సవాలు చేయడం గొప్ప విశేషం. కమ్యూనిస్టుల పని అయిపోయిందన్న వారికి కనువిప్పు.
కేంద్రంలోని బిజెపికి మోడీ ప్రభుత్వానికి వామపక్షాలు నిలదొక్కుకోవడం ఇష్టముండదు. అందుకే లోలోపల మమత విజయాన్నే కోరుకుంటున్నారు. రాజకీయ మనుగడ కోసం పైకి విమర్శలు కురిపిస్తున్నా అవి తేలిపోతున్నాయి. ఎన్నికల సంఘం వరుసగా అనేక మంది అధికారులపై చర్చ తీసుకోవడమే గాక రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది కూడా. అయినా సరే నారద ఆపరేషన్పై దర్యాప్తుకు కేంద్రం సిద్ధపడదు. ఈ పరిస్థితుల్లో ప్రజలే తమ తీర్పుతో మార్గం సుగమం చేస్తారు.బిజెపి కూడా దాదాపు ఆశవదులుకుని దింపుడు కల్లం తరహాలోనే హడావుడి చేస్తున్నది.