కథలు ఇలాకూడా రాస్తారు…
2013 లో సాహితీ స్రవంతి హైదరాబాదులో కథా రచనపై ఒక కార్యశాల నిర్వహించింది. చాలామంది ప్రముఖ రచయితలు విమర్శకులు హజరై ప్రసంగించారు. సభికులు వెలిబుచ్చిన కొన్ని సందేహాలకు కూడా సమాధానమిచ్చారు. ఈ ప్రసంగ వ్యాసాలతో తర్వాత సాహిత్య ప్రస్థానం ప్రత్యేక సంచిక ‘కథనశాల’ పేరుతో వెలువడింది. అది చదివి చాలా మంది కొత్త కథకులు ప్రేరణ పొందారు. కథా కార్యశాల ప్రయోజనం అర్థం కావడంతో తర్వాత కవిత్వ తరగతులు కూడా జరిపాము.
ఇదంతా గతం. ఆ కార్యశాల ప్రభావం ఇప్పుడు మరో రూపంలోనూ మన ముందుకు రావడం సంతోషదాయకం. అక్కడ మాట్లాడి తర్వాత వ్యాసం రాసిన మహమ్మద్ ఖదీర్బాబు ఈ మూడేళ్లుగా నిశ్శబ్దంగా ఒంటరిగా కృషి చేస్తూ కథలు ఇలాకూడా రాస్తారు
అనే 325 పేజీల అందమైన పుస్తకాన్ని తీసుకొచ్చారు. మార్చి 20న హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సాహిత్య మిత్రుల సమక్షంలో సీనియర్ రచయిత రామచంద్ర ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి అద్యక్షులు, సాహిత్య ప్రస్థానం సంపాదకులు తెలకపల్లి రవి సభకు అద్యక్షత వహించి మాట్లాడుతూ పుస్తకం చాలా సమగ్రంగా అనేక కోణాలను పరిచయం చేసేలా వుందని అభినందించారు. కథా కార్యశాల ఇంత మంచి పుస్తకానికి ప్రేరణ కావడం పట్ల సంతోషం వెలిబుచ్చుతూ దీన్ని అందరికీ చేరువ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గతంలో కథల గురించి వచ్చిన పుస్తకాల వరవడికి భిన్నంగా ఖదీర్ బాబు వందలాది ప్రత్యక్ష
ఉదాహరణలతో అప్పుడు ప్రస్తావనకు రాని ఆధునిక రచయితలతో అర్థవంతంగా దీన్ని వెలువరించారని వివరించారు. ఈ సభలో ఇంకా రచయితలు జిఆర్ మహర్షి, చూపు కాత్యాయని, కొర్రపాటి ఆదిత్య, వేంపల్లి షరీప్లు కూడా మాట్లాడారు. సభలో పాల్గొన్న కొందరు మిత్రులకు పుస్తక రూపకల్పనలో భాగం పంచుకున్న సాంకేతిక నిపుణులకు అద్యక్షుడు పుస్తకం ప్రతులు అందించారు. ఈ సభలో మొదట కుప్పిలి పద్మ స్వాగతం పలకగా చిత్రకారులు మోహన్, పి.రామకృష్ణ, టీవీ 9 కిశోర్దాస్, జకీర్, మధుసూదనరావు, పొనుగోటి కృష్ణారెడ్డి, శాంతసుందరి, గణేశ్వరరావు, అక్కిరాజు ఇంకా చాలా మంది సాహిత్య మీడియా మిత్రులు పాల్గొన్నారు.