బెంగాల్‌లో సిపిఎంకు సవాళ్లు, వ్యూహాలు

wbcpm111 mmta1111

అయిదు రాష్ట్రాలలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సంబంధించిన రాజకీయ విధానాన్ని సిపిఎం ప్రకటించింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలోనూ ఎన్నికలు సిపిఎంకు వామపక్షాలకు మరీ కీలకమైనవి. కేరళలో ఒక పర్యాయం ఎల్‌డిఎఫ్‌ మరో పర్యాయం యుడిఎప్‌ గెలిచే సంప్రదాయం చాలా కాలంగా నడుస్తున్నది.. ప్రస్తుత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వూమెన్‌ చాందీ స్వయంగా అనైతిక అవినీతి ఆరోపణలకు గురవడమే గాక యుడిఎప్‌ మంత్రులు చాలామంది అభిశంసనలతో శిక్షలతో అవమానకరంగా నిష్క్రమించవలసి వచ్చింది. ఇలాటి నేపథ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ అధికారంలోకి రావడం తథ్యమన్న భావనే అందరిలో వుంది. పశ్చిమ బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పాలించిన వామపక్ష సంఘటన ఓడిపోవడం ఒకటైతే- గెలిచిన మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో సాగుతున్న నిర్బంధ దౌర్జన్య కాండ మరింత భయానక పరిస్థితిని సృష్టించింది. గత కొద్ది మాసాలలోనూ 180 మంది సిపిఎం కార్యకర్తలు హత్యకు గురైనారని ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. వందలాది మంది ఇళ్లనుంచి తరిమివేయబడడం, ఉద్యోగాలు ఉపాధి భూములు కోల్పోవడం మాత్రమే కాదు- చౌక ధరల దుకాణాలలో దినుసులు పొందే అవకాశం కూడా నిరాకరించబడుతున్నది. ఎన్నికలకు ముందు మమతతో చేతులు కలిపిన కిషన్‌జీతో సహా మావోయిస్టులు చాలామంది హతం చేయబడ్డారు. పాత్రికేయులు విద్యావేత్తలు, కార్టూనిస్టులు, తృణమూల్‌ను విమర్శించే వారెవరికీ భద్రతలేని పరిస్థితి. ఆఖరుకు స్వంతపార్టీలోని విమర్శనాత్మకంగా మాట్లాడిన వారిని కూడా సహించలేని మమత అనేక విధాల నిర్బంధానికి గురి చేశారు. నిరాడంబర నీతివంత నేతగా ప్రచారం పొందిన ఆమె సహాయకులతో సహా శారదా చిట్స్‌ కుంభకోణంలో పీకలవరకూ కూరుకుపోయినా మోడీ ప్రభుత్వ సౌజన్యంతో దర్యాప్తు లేకుండా నెట్టుకొస్తున్నారు.
అయితే ఈ వాస్తవాలు మన మీడియాలో ప్రముఖంగా రావు.. 1970లలో ఇందిరా గాంధీ నియంతృత్వం నడుస్తున్నప్పుడు కూడా ఇదే మౌనం సాగింది. సిపిఎం పదేపదే ప్రజాబలంతో గెలుస్తుంటే రిగ్గింగ్‌ ఆరోపణలకు విపరీతమైన ప్రచారం లభించిందిగాని ఒక్కసారి కూడా రుజువు కాలేదు! నందిగ్రామ్‌ వంటి వాటిపై మాత్రం విపరీత ప్రచారం నడిచింది. ఆ విమర్శనా దృష్టి మమత విషయంలో నాస్తి. బెంగాల్‌లో ప్రధాన పత్రికలు మొదటి నుంచి సిపిఎంను వ్యతిరేకమే. ఒక క్రమ పద్ధతిలో మమతకు అనుకూల వాతావరణం పెంపొందించడంలో వాటి పాత్ర తక్కువది కాదు. ప్రజల కోసం అసమాన కృషి చేసిన వామపక్ష ప్రభుత్వ చివరి దశలో కొన్ని పొరబాటు నిర్ణయాలు జరిగిన మాట నిజమే . కాని ఆ చాటున ఆరాచక శక్తులను పోగేసుకున్న మమతా బెనరీన్జి అపరకాళికగా ప్రజల ముందుంచడం కూడా పొరబాటే.కాంగ్రెస్‌ ,బిజెపిలు పోటీలు పడి ఆమెను కేంద్రంలో చేర్చుకుని మరింత సహకరించాయి. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ నేరుగా పొత్తుకలిపితే బిజెపి పరోక్షంగా చేతులు కలిపింది. తన ఆందోళన కార్యక్రమాలూ ప్రచారాలతో ప్రజలలోనూ మద్దతు పెంచుకోవడంలో మమతా బెనర్జీ కృతకృత్యమై విజయం సాధించారు.
ఈ విధంగా గతంలో తృణమూల్‌ను అదేపనిగా నెత్తినెత్తుకున్నవారు ఆ పాలనలో అకృత్యాలను కప్పిపుచ్చడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఒకదశలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి బయిటకు వచ్చేసింది. బిజెపి మోడీ గాలిలో ఓటింగు పెరగడం వల్ల మేమే ప్రత్యామ్నాయమవుతామంటూ కొంతకాలం హడావుడి చేసి వెనక్కుతగ్గింది.. తృణమూల్‌ పడిపోతే సిపిఎం వామపక్షాలు వస్తాయన్న వ్యతిరేకత తప్ప ఇందుకు మరో కారణం లేదు. రాజ్యసభలో ప్రభుత్వ బిల్లులు ఓడిపోతున్న పరిస్థితిని ఆధారం చేసుకుని అక్కడ వత్తాసు నివ్వడం ద్వారా మమతా బెనర్జీ బిజెపిని ప్రసన్నం చేసుకున్నారు.తాను తిట్టిపోసిన కాంగ్రెస్‌ అద్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలసి వచ్చారు. అయితే రాష్ట్రంలో ఆ ప్రభుత్వ నిర్బంధాన్ని దాడులను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఎలాగైనా ఓడించాలంటే సిపిఎంతో కలవాలని చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితులలో రానున్న శాసనసభ ఎన్నికలలో సిపిఎం కాంగ్రెస్‌ల మధ్య అవగాహన వుండవచ్చనే వూహాగానాలు బయిలుదేరాయి. మమతా ప్రభుత్వ దాడులను ఎదుర్కోవడానికికాంగ్రెస్‌ నాయకులు ఇందుకు ముందుకు వస్తారో లేదో తేలాలని మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య వంటివారు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.. ప్రభుత్వ నిర్బంధం దాడుల వంటి వార్తలను వాస్తవాలను పెద్దగా ఇవ్వని కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్‌తో పొత్తు అవకాశాలనే అంశానికే ఎక్కడలేని ప్రచారం కల్పిస్తూ ఒక వాతావరణం పెంచడానికి ప్రయత్నించాయి. వీటిని ఖండించేందుకు గాని ధృవపర్చేందుకు గాని సిపిఎం కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు సిద్ధం కాలేదు. చివరకు కేంద్ర నాయకుల సమక్షంలో బెంగాల్‌ రాష్ట్ర కమిటీ విస్త్రతంగా చర్చించి తన అభిప్రాయాలు నివేదించింది.వీటిని ఇతర రాష్ట్రాల పరిస్థితిని కూడా గమనంలో వుంచుకుని కేంద్ర కమిటీ రాజకీయ విధాన సూత్రాలు ప్రకటించింది.ఇది ఆ పార్టీ నిర్ణయాలు తీసుకునే పద్ధతికి అనుగుణంగానే జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లో సాగుతున్న దుర్మార్గ పాలన సాగిస్తున్న తృణమూల్‌ను గద్దెదించి బిజెపి మతతత్వ విభజనను ఓడించడం కీలక కర్తవ్యాలుగా అన్ని ప్రజాస్వామ్య శక్తులతో కలసి పనిచేయాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు సారాంశం. కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు నిర్ణయం తీసుకుంటే దాడి చేద్దామని ఆశించిన వారూ, ఆ అవకాశమే లేదని నేరుగా ఖండిస్తే ఆనందించాలని ఆశించిన వారూ కూడా దీంతో నిరుత్సాహానికి గురైనారని చెప్పాలి.. కాంగ్రెస్‌ కేంద్రిత ప్రశ్నలకు ఏ విధమైన సమాధానమిచ్చినా వ్యాఖ్యానాలు పరిపరివిధాల గందరగోళానికి నడిపిస్తాయి గనక సీతారాం ఏచూరి తీర్మానానికే పరిమితమై మాట్లాడారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌ వెళ్లి తృణమూల్‌తో కలిసే అవకాశం లేకుండా చేయాలన్నది సిపిఎం వ్యూహంలో ప్రధానాంశమని కొందరు వ్యాఖ్యాతలు సరిగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం సిపిఎంతో అవగాహన అనివార్యమని చెబుతున్నా కేంద్ర కమిటీ తాజా నిర్ణయాలను వారు స్వాగతిస్తున్నా అధిష్టానం ఇంత వరకూ నోరువిప్పింది లేదు.మీడియాలో ఏం కథనాలు వచ్చినా సరే ఎవరైనా ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపాదనలతో వస్తే పరిశీలిస్తామని మాత్రమే సిపిఎం ప్రకటించింది. వాటిపై రాష్ట్ర కమిటీ నిర్ణయాలు చేస్తే తుది నిర్ణయం తీసుకోవడానికి పొలిట్‌బ్యూరోకు అధికారమిచ్చింది. చాలామంది బెంగాల్‌ నాయకులతో పాటు కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌ మాత్రమే బెంగాల్‌లోని ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు అవసరమేనని కేరళపై ఆ ప్రభావం ఏమీ వుండదని బహిరంగంగా వ్యాఖ్యానించారు.
వాస్తవిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడం తప్పుకాదు గాని సిపిఎం రాజకీయ అవసరాలకోసం సిద్ధాంతాలు వదిలేస్తుందని బెంగాల్‌పై తీసుకున్న నిర్ణయం నిరూపిస్తుందని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆరోపించింది. పత్రికలు విమర్శలు చేయడం తప్పు కాదు, ఎక్స్‌ప్రెస్‌ సిపిఎంపై నిశిత విమర్శలు గుప్పించడం కొత్తా కాదు. ఇంకొంత మంది పొత్తు అమలులోకి వచ్చినట్టే చిత్రిస్తున్నారు. ఇంకొంత మంది వ్యక్తిగత విభేదాలు కూడా అంటగడుతున్నారు. వామపక్షాలకు కంచుకోట వంటి బెంగాల్‌ను అక్కడ ఉద్యమస్పూర్తిని కార్యకర్తల స్థయిర్యాన్ని నిలబెట్టుకోవడం యాభై ఏళ్ల సిపిఎం రాజకీయ చరిత్రలో ఒక పెద్ద సవాలు అనడం నిస్సందేహం. అదెలా జరుగుతుందో చూడవలసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *