చంద్రబాబుకు జాషువా జవాబు!
ఎస్సిలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరంటూ నిన్న చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు సవరించుకుంటారని భావించాను. అయితే తాను వారు పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే వక్రీకరిస్తున్నారని ఆయన అతకని సమర్థనకు దిగారు. పేదలుగా పుట్టిన వారు విచారిస్తారు ధనవంతులు గొప్పగా వుంటారనే భావన కూడా పొరబాటే. ఆత్మగౌరవం గల వారెవరూ పుట్టుక గురించి విచారించరు. రెండవది పుట్టాలని కోరుకోరు అనడం ఆత్మన్యూనతను పెంచడానికి దారితీస్తుంది. తక్కిన కులాల వారు గొప్పవారన్న భావానికి ఆమోదం తెల్పినట్టవుతుంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు జాషవా ప్రసిద్ధ పద్యమే జవాబు.
కులమతాలుగీసిన గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను!
హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఉదంతం దేశంలో ఎంత సంచలనం రేపిందీ చూడగలిగితే దళితులు అంత నిస్సహాయంగా రోదించే దుస్థితిలో లేరని తెలుస్తుంది. చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే సామాజిక నిరసన తీవ్రమవడం తథ్యం. దళిత నేతలు కేసులు పెట్టినా కోర్టులు స్వీకరిస్తాయి. ఇటీవలి కాలంలో హర్యానాలో జరిగిన ఒక హత్యకు సంబంధించి కుక్కలతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వికెసింగ్ వాటిపై క్షమాపణలు చెప్పక తప్పింది కాదు.

