సక్రమ ఖాతాలేనేమో: ఆర్బిఐ సన్నాయి నొక్కులు
పనామా పేపర్ల ప్రకంపనాలతో ప్రపంచం హౌరెత్తిపోతుంటే రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మరో విధంగా మాట్లాడుతున్నారు. ఆ విదేశీ ఖాతాలకు సహేతుకమైన కారణాలు వున్నాయేమో. అవన్నీ సక్రమమైనవేనేమో.. ఎందుకంటే మనం ప్రవేశపెట్టిన లిబరలైజ్డ్ రెమిటెన్సెస్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) కింద రెండున్నర లక్షల డాలర్ల వరకూ అధికారికంగానే విదేశీ కంపెనీలకు లేదా చెల్లింపులకు పంపించే అవకాశముంది. ఇప్పుడు బయిటకు వచ్చిన ఈ వివరాలు పరిశీలించి అలాటి కారణాలు వున్నాయేమో చూడాలి అని ఆర్బిఐ గవర్నర్ సెలవిచ్చారు. పేర్లు బయిటకు వచ్చిన ప్రసిద్ధులు ఇచ్చిన వివరణ కూడా ఆ తరహాలోనే వుంది గనక చివరకు ఇదంతా టీ కప్పులో తుపానులా తేల్చిపారేస్తారేమో! ఎందుకంటే ఈ ఆసాములంతా అధికార పార్టీలకు ఆప్తులు ఆత్మీయులు కదా. మోడీగారి ప్రియనేస్తం అదానీ సోదరుడు, సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వద్రాకు స్థలాలు కట్టబెట్టిన డిఎల్ఎప్ అధినేత కెపిసింగ్ వంటివారి పేర్లు వున్నాయి. కనుక ఏదో విధంగా సద్దుమణగడం ఖాయం.
