మోడీ మాట – సత్యమేవ జయతే

జెఎన్యు వివాదంపై చర్చ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక గొప్ప మాట చెప్పారు. తన అభిమాన పాత్రమైన ట్విట్టర్లో సత్యమేవ జయతే అని ప్రకటించారు. ఇక చూడండి- జెఎన్యు విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్నయ్యకు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇప్పుడు వారిని విచారించిన ఉన్నత స్థాయి కమిటీ ఆయనపైనే గాక తక్కిన ఎనిమిది మందిపైన కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని సిఫార్సు చేసింది. కన్నయ్య కుమార్తో పాటు రామ్నాగా, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, అసుతోష్ కుమార్, అనంత ప్రకాశ్, ఐశ్వర్య అధికారి,శ్వేతారాజ్లపై సస్పెన్షన్ తొలగించాలని ఈ కమిటీ తయారు చేసిన నివేదిక వైస్ఛాన్సలర్ జగదీష్ కుమార్కు సమర్పిస్తుంది. ఆయన తుది నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. నివేదికలో పేర్కొన్న ఆరోపణల తీవ్రతను బట్టి కొందరికి జరిమానా, కొందరిని హాస్టళ్లనుంచి ఖాళీ చేయించడం, మరికొందరిని బహిష్కరించడం(రస్టికేట్) జరగొచ్చని యూనివర్సీటీ అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో హెచ్సియులోనూ నివేదిక మెతగ్గా వుందని వైస్ ఛాన్సలర్ అప్పారావు తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం చూశాం.అయితే దేశమంతటా నిరసన పెల్లుబికిన నేపథ్యంలో జెఎన్యులో అలాటి దుస్సాహసం చేయకపోవచ్చు. కాని ఆరెస్సెస్ కార్యదర్శి భయ్యాజీ జోషి విద్యాలయాలనుంచి జాతి వ్యతిరేకులను తొలగించాలన్నట్టు మాట్లాడ్డం, వారి విద్యార్థివిభాగం నివేదికలోనూ తీవ్ర పదజాలం వాడటం చూస్తే మాత్రం ఈ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం చేయడానికి కేంద్రం సిద్ధపడకపోవచ్చనే అనిపిస్తుంది.ఇప్పటికైతే వారికి అనుకూలంగా నివేదిక వుంది.