వారింకా పెద్ద దేశ ద్రోహులా?
అఫ్జల్ గురు ఉరితీతపై ఏదో కార్యక్రమం జరిగిందంటూ జెఎన్యు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి దేశ ద్రోహ నేరం ఆరోపించి వేధిస్తున్నారు. దీనిపై సాక్ష్యాధారాలు చూపి సంయమనంతో వ్యవహరించాలని చెప్పేవారందరిపైనా బురద జల్లుతున్నారు బిజెపి ఎబివిపి నేతలు.
కాని జమ్మూ కాశ్మీర్లో ఆ ఉరితీతను తీవ్రంగా ఖండించిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి)తో కలసి అధికారమే నెరిపారు కదా, వారినేమనాలి? కీర్తిశేషులైన ముఖ్యమంత్రి మఫ్తి మహ్మద్ సయిద్ కూడా అఫ్జల్ గురు అవశేషాలను అప్పగించాలని కోరిన వారిలో ఒకరు. అంతేనా? ఎన్నికలు ప్రశాంతంగా జరిగినందుకు పాకిస్తాన్కు కృతజ్ఞతలు చెప్పారాయన!
ఇప్పుడు జెఎన్యు కల్లోలం అనంతరం కూడా పిడిపి సీనియర్ నాయకుడు రఫీ అహ్మద్పరా మాట్లాడుతూ తాము ఈ ఉరితీత సరికాదన్న అభిప్రాయానికే కట్టుబడివున్నామని ఆదివారం పునరుద్ఘాటించారు. బిజెపి ప్రభుత్వం ఆయన భౌతిక అవశేషాలను అప్పగించాలని కోరారు. ఆ పార్టీ యువ నాయకుడు కూడా అదే కోరారు.
జెఎన్యులో ఎవరు ఏం చేశారో చెప్పే ఆధారాలు ఎవరిదగ్గరా లేవు. పిడిపి అగ్రనాయకులే బాహాటంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. వారితో స్నేహం నెరపడమే గాక ఎలాగైనా మెహబూబా మఫ్తీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తంటాలు పడుతున్న బిజెపి గాని కేంద్ర నాయకులు గాని దేశ ద్రోహులై పోతారా? ఎట్టిపరిస్తితుల్లో ఇలాటి శక్తులను సహించేది లేదంటున్న హౌం మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే కాశ్మీర్ పయనం కడతారా?
రాజకీయాల్లో ఎవరి విధానాలు వారికి వుంటాయి. తాము ఏం చేసినా దేశభక్తి అని కితాబులిచ్చుకుని అవతలివారిపై విద్రోహ ముద్రలేసే వారి నిజస్వరూపం ఇది! హతవిధీ!
