అదే భాష.. అదే ఘర్షణ..
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వివాదం సద్దుమణగకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిస్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులతో ఘర్షణలు పెంచుకుంటుందా? అఫ్టల్ గురు ఉరితీతను ఖండిస్తూ విద్యార్థులు ప్రదర్శన తీయడం దేశ ద్రోహమని ఇప్పుడు అభియోగాలు ప్రారంభించింది.నిజానికి ఉరితీతల మూడవ వార్షికం సందర్భంలో విద్యార్థులు ముందుగా అనుమతి తీసుకున్నారు. అయితే ఆ పత్రంలో అఫ్టల్ గురు పేరు లేదన్నది అధికారుల ఆరోపణ. అయితే అంత మాత్రాన విద్యార్థులు విద్రోహులై పోతారా అనే ప్రశ్న వస్తున్నది. సాక్షాత్తూ హౌం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇలాటి కార్యకలాపాలను
సహించేది లేదని హెచ్చరిక జారీ చేయడం.. ఆ వెంటనే పోలీసులు హాస్టళ్లలో జొరబడి యూనియన్ అద్యక్షుడు కున్హన్ కుమార్ను అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇటీవలే వైస్ ఛాన్సలర్గా నియమితుడైన పరివార్ అభిమాని జగదీశ్ కుమార్ కూడా అలాటి హెచ్చరికలే చేశారు. ఒక వేళ విద్యార్థులు ఆవేశంలో ఏదో చేశారనుకున్నా దేశ ద్రోహ ముద్రలు వేసి మన యువతను మనమే దూరం చేసుకోవాలా అన్నది ఒక ప్రశ్న.ఇప్పుడిప్పుడు చల్లారుతున్న విశ్వవిద్యాలయాలను మళ్లీ రగిలించడానికి ఇదో పాచికా అన్నది మరో ప్రశ్న.విశాలమైన దృక్పథానికి విస్త్రతమైన చర్చలకు వేదికగా నిలిచిన జెఎన్యుకే ఈ పరిస్థితి ఎదురైతే మిగిలిన చోట్ల మరెలాటి మార్పులు వస్తాయో చూడాల్సిందే.
