ఏ సిఎం సెటిల్మెంట్ ముష్కిల్ హై!
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రం విడుదల కోసం నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్తో కుదుర్చుకున్న ఒప్పందం గురించి తెలకపల్లి రవి.కామ్లో మొన్న చెప్పుకున్నాము. ఈ సినీయుక్తిలోని డొల్లతనం కూడా ప్రస్తావించుకున్నాం. ఆ ఉదంతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢనవిస్ పాత్రపై ఇప్పుడు విమర్శల దుమారం రానేవచ్చింది. రాష్ఠ్రాధినేతగా వుండి ఈ లేని పోని మధ్యవర్తిత్వం నెత్తిపై వేసుకుని ఆయన దళారిగా మారిపోయారని రాజకీయ పార్టీలే గాక షబానా అజ్మీ వంటి సీనియర్ నటీమణులు కూడా విమర్శించారు.
కంగు తిన్న ఫడనవిస్ శాంతిదూత పాత్ర చాలించి సమర్థనలకు దిగారు. అయిదు కోట్ల విరాళం ఇవ్వాలని తాను రాజీ కుదర్చలేదని ఆ విషయమై పట్టుపట్టొద్దని నిర్మాతల మండలి ఇష్టమని చెప్పానని వాదిస్తున్నారు. అయినా విడుదలకు ఆటంకం కలిగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలసింది పోయి పంచాయితీలు సెటిల్మెంట్లు చేయడం ముఖ్యమంత్రి పని అవుతుందా? భారత మాతా?
తన చిత్రం ఏ దిల్హైముష్కిల్ ఎలాగైనా విడుదల చేయించుకోవడం కోసం నిర్మాత
దర్శకుడు కరణ్జోహార్ ముందునుంచే పక్కా స్త్రీన్ప్లేతో పాకిస్తాన్ కళాకారులకు చోటు వుండకూడదనే ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 28న విడుదల కావలసిన ఆయన చిత్రంలో ఫరాద్ ఖాన్ అనే పాక్నటుడున్నాడు గనక పూర్వపు శివసేన వంటి శక్తులు అడ్డు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందే దీనిపై ఆయన రభస ప్రారంభించాడు. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవిస్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అద్యక్షుడు రాజ్థాకరేలతో చర్చలు జరిపి విడుదలకు అనుమతి పొందాడు. చిత్రంలో మొదటే యురి మృతులకు జోహారులర్పించడమే గాక పాక్ టెర్రరిజాన్ని ఖండిస్తారట. ఇక ముందు పాక్ కళాకారులను తీసుకోనని కూడా ప్రకటించారు. అయితే ఈ సందర్భంలో భారత సైనిక సంక్షేమ నిధికి అయిదు కోట్ల విరాళం ఇవ్వాలని రాజ్ షరతు పెట్టడం కరణ్ అంగీకరించడం జరిగిపోయింది. ఇప్పటికే పాక్ నటులతో రూపొందిన ఏ చిత్రం విడుదల కావాలన్నా 5 కోట్ల విరాళం ఇవ్వాలట. నిర్మాత ఒప్పుకున్నాడు గాని మాజీ సైనికాధికారులు మాత్రం ఇదేం రాజకీయమని మండిపడ్డారు. సైన్యం విషయంలో బయిటవారి జోక్యం మంచిది కాదని హితవు చెప్పారు.ఇది ఇలా వుంటే థియేటర్ యజమానులు మాత్రం విడుదలకు ఒప్పుకునేది లేదంటున్నారింకా. కరణ్ ఓవర్యాక్షన్ శోభా డే వంటి వారు కూడా విమర్శించారు.
ఇది ఇలా వుంటే మరో వైపున సినీ దేశభక్తి పొంగిపొర్లుతూనే వుంది.తాజాగా అక్షయ కుమార్ అమితాబ్ బచన్లు సైనికులను ఉత్తేజపర్చే సందేశాలు పాటలు అప్లోడ్ చేశారట.
భారత సైన్యం సాహసాలను రాజకీయ ప్రచారానికి వాడుకోవడం సరికాదని ప్రతిపక్షాలు మీడియా వ్యాఖ్యాతలు మేధావులు చెబితే బిజెపి నేతలకు చాలా కోపం వచ్చింది. పాకిస్తాన్పై చేసిన దానికన్నా ఎక్కువగాఈ విమర్శలపై ఎదురుదాడి చేశారు. అయితే ఇప్పుడు సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఇదే విమర్శ చేసింది. హిందూత్వ పై గతంలో ఇచ్చిన తీర్పును పునస్సమీక్షిస్తున్న సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి టిఎస్ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే జాతీయ పతాకాన్ని చిహ్నాలను తీసుకుని ఓట్లు అడగొచ్చు. సరిహద్దుల్లో సైనికులు చనిపోతున్నారు గనక పలానా పార్టీకే ఓటేయమని అడగొచ్చు. దీన్ని అనుమతిద్దామా అని ఆయన ప్రశ్నించారు.
ఇది ఇలా వుంటే
ఇవన్నీ అయ్యాక ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు సరిహద్దుల్లో సైనికులకు దీపావళి శుభాకాంక్షలు పంపాలంటూ కొత్త ఉద్యమం ప్రకటించారు. దీనికోసం తన కార్యాలయ వెబ్మెయిల్ చిరునామా ఇచ్చారు.స్వతహాగా ప్రచారకుడైన ప్రధాని గతంలో దసరాను ఇదే ప్రచారానికి వాడుకున్నారు. ఇప్పుడు దీపావళికీ రాజకీయ రంగు పులుముతున్నారు.యుద్ధం రాకపోయినా ఏదో అలాటి వాతావరణం తీసుకొచ్చి తామేదో ఘనత సాధించామని చాటుకోవదం ఆయన ఉద్దేశం. ఇక సుప్రీం కోర్టు విమర్శలు ఏం గౌరవిస్తారు?