టీవీ9 అమ్మకం కదలికలు, కథనాలూ,

అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్(ఎబిసిఎల్) ఆధ్వర్యంలోని టీవీ9 ఛానల్ అమ్మకం గురించి చాలాకాలంగా ఇంకా చెప్పాలంటే ఏళ్లుగా చర్చ నడుస్తూనే వుంది. వెంచర్ క్యాపిటలిస్లుగా 60 శాతం వాటా వున్న చింతలపాటి శ్రీనిరాజు దాన్ని లాభదాయకంగా ముగించాలనే అప్పటినుంచి చూస్తున్నారనేది కూడా నిజమే. కాని వ్యవస్థాపక సిఇవో మాత్రమే గాక 20 వాటాదారుగానూ వున్న రవిప్రకాశ్కు తనవైన ఆలోచనలు వుండటంతో పాటు రాష్ట్ర విభజన, రాజకీయ అస్థిరత్వం , ఆపైన కొంతకాలం తెలంగాణలో ఛానల్ నిలిపివేత వంటి కారణాలన్నీ కలసి తుది నిర్ణయాన్ని వెనక్కునెట్టాయి. 2009లో అమెరికాకు చెందిన సైఫ్ పార్టనర్స్ మరో 20 శాతం వాటా తీసుకున్నారు. ఈ విషయంలో తమ సిఇవో పెద్ద హడావుడి పడటం లేదని ముఖ్యస్థానంలో వున్న ఒక మిత్రుడు గత నెలలో చెప్పారు. అయితే మొన్న ఒక ప్రధానపార్టీ ప్రతినిధి జీకి టీవీ9 అమ్మకం పూర్తయిపోయిందని నమ్మకంగా చెప్పారు. ఆ మరుసటి రోజు వార్త కూడా వచ్చింది. ఒకటి రెండు మాసాల కిందట సుభాష్ చంద్ర యాజమాన్యంలోని జీ గ్రూపుతో ఎబిసిఎల్కు ఒక ఒప్పందం కుదిరిందని బిజినెస్ స్టాండర్డ్ వార్త ఇచ్చింది. మంగళవారం ఒక ప్రముఖ తెలుగు పత్రిక కూడా క్లుప్తంగా వాణిజ్యపేజీలో వార్త ఇచ్చింది. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదన్న సూచన కూడా చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి వాకబు చేయగా ఏదీ ఇంకా తేలలేదని సమాచారం వచ్చింది.కాకపోతే
ఈ సంగతి చెప్పిన వర్గాలు గతంలో చెప్పినంత ధీమాగా గాక ఒకింత నిర్లిప్తంగానూ అస్పష్టంగానూ మాట్లాడినట్టు కనిపించింది. తమ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు జీ గ్రూపు ప్రతినిధులు ఇష్టపడలేదని బిజినెస్ స్టాండర్డ్ రాసింది.అయితే రవి ప్రకాశ్ మాత్రం వారితో మాట్లాడారు. మామూలుగా వెంచర్కాపిటలిస్టులు ఏడేళ్లలోనే తప్పుకుంటారనీ, కాని తమ విషయంలో 12 ఏళ్లుగా వారు కొనసాగుతున్నారని ఆయన చెప్పారట. జీ గ్రూపు కొనుగోలు విషయంలో ఏదీ ముగియలేదని చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన సమాధానం.
2003లో తెలుగులో మొదలైన టీవీ9 దేశంలో ఇతర భాషల్లోనూ ఏడు ఛానళ్లు నడుపుతున్నది. ఇందులో మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లోనూ కన్నడంలోనూ బాగా విజయవంతమైందంటారు. గతంలోనే ఈటీవీ గ్రూపు ఛానళ్లు చేతులు మారగా ఇప్పుడు టీవీ9కు కాస్త అటూ ఇటుగా మారనుంది. ఇది మన సమాచార రంగంలోనూ రాజకీయ కథనాల్లోనూ అంతకంటే ముఖ్యంగా కార్పొరేట్ కోణాల్లోనూ చాలా మార్పులు తీసుకురావడం అనివార్యం. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి మరింత పటిష్టమైన సమాచార వ్యవస్థ విస్తరించుకోవాలని ఆలోచిస్తున్నది. అనుభవంలో ఆరితేరిన వెంకయ్య నాయుడు సమాచార ప్రసార శాఖామంత్రిగావుండటం, కమ్యూనికేషన్ రంగంలో రిలయన్స్ భారీగా కేంద్రీకరించడం కూడా ఈ దిశలో జరుగుతున్న పరిణామాలే.జీ గ్రూపునకు వివిధ భాషల్లో మొత్తం 35 ఛానళ్లు వున్నాయి.తెలుగులో వారి వార్తా ఛానల్ను మూడేళ్ల కిందట మూసి వేశారు. ఇప్పుడు టీవీ9 తీసుకుంటే వారు ఏ విధంగా నడుపుతారన్నది కూడా ఆసక్తికరం.
మీడియాపై ప్రజల ఆసక్తి రీత్యానూ ఇప్పటికే దీనిపై అనేక కథనాలు చలామణిలో వున్నందువల్ల ఈ విషయాలు పోస్టు చేస్తున్నా.