కవరింగ్‌ఆపరేషన్‌- పార్ట్‌ 2

01THCARTOONSCAPECO_2953914f

ప్రత్యేకహౌదా నిరాకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్తం మరిగిపోతుందని అన్నారని మన ఎంపిలు సరిగ్గా వ్యవహరించలేదని ఆయన మందలించారని ఆంధ్రజ్యోతి రాసింది. తెలుగుదేశం ఎంపిలు ప్రభుత్వంలో వున్నా నిశితంగా మాట్లాడి బిజెపిని ఇరుకునపెట్టారని పేర్లతో సహా అదే పత్రిక మరో కథనంలో ప్రశంసలు కురిపించింది. అగ్రఛానల్‌ టిడిపి బిజెపి తెగతెంపులు నిర్ణయమైపోయినట్టే ఆవేశపడిపోయింది. తీరా చూస్తే శుక్రవారం చంద్రబాబు నాయుడు మీడియా గోష్టి గాని, ఆదివారం సీనియర్‌ నాయకులతో సమావేశం గాని షరామామూలు ఫార్ములాలోనే నడిచాయి. ఛీత్కారాలు తిరస్కారాలు ఎన్ని ఎదురైనా రాయబారాలు పంపడమే మార్గమని అధినేత నిర్ణయం తీసుకున్నారు. తను స్వయంగా 30 సార్లు వెళితే మారని కేంద్రం తమ ఎంపిలు వెళ్లి ప్రధాని మోడీతో రెండు గంటలు మాట్లాడితే ఏదో ఒరిగిపోతుందని చెప్పడం చూసి అంతా నివ్వెరపోయారు. కేంద్రాన్నివదలి ప్రతిపక్షాలపై బాణాలు ఎక్కుపెట్టడం మరో విపరీతం. ఈ విధంగా చంద్రబాబు కార్యాచరణకు తటపటాయిస్తుంటే పైన చెప్పుకున్న పత్రికలు ఛానళ్లు మాత్రంఅమీతుమీ వైపుగా నడుస్తున్నట్టు కథలు వినిపించాయి. జూపూడి ప్రభాకరరావు, వైబీరాజేంద్రప్రసాద్‌, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు రంగంలోకి దిగి తీవ్ర విమర్శలు కురిపించారు. అధినాయకత్వమే రాజీ పడిన నేపథ్యంలో వారి పాత్ర వారు బాగా పోషించినా ఏం ఫాయిదా? రక్తం మరిగినట్టు కథనం ఇచ్చిన పత్రిక గాని,బిజెపి టిడిపి తెగతెంపులు ఖాయమని కథనాలిచ్చిన ఛానల్‌ గాని అంచనాలు తప్పాయని అంగీకరించే సూచనలేమీ లేవు. పార్లమెంటులో తెటుగుదేశం వీరోచిత పోరాటం చేస్తున్నట్టుగా కొత్త కథనాలు ఎత్తుకున్నాయి. దాని కొనసాగింపుగా మధ్యాహ్నం నుంచి ప్రధాని మోడీతో సీనియర్‌ మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమవడం పెద్ద వార్తగా మారింది.ఆయన జైట్లీ సుజనా చౌదరి కూచుని మాట్లాడాలని మోడీ పురమాయించారని స్క్రోలింగులు. ఈ త్రయం ఎన్నిసార్లు కూచొలేదు? ఎన్ని ప్రకటనలు చేయలేదు? ఇక్కడ తమాషా ఏమంటే తెలుగుదేశం ఎంపిలు రాయబారం కూడా వెళ్లకపోగా వెంకయ్యకే మళ్లీ బాధ్యత అప్పగించడం! ఎవరైతే దీనంతటికీ ఒక సూత్రధారిగా వున్నారో వారినే ఆశ్రయించడం హాస్యాస్పదం. మరో విశేషమేమంటే వైసీపీ సభ్యులు పోడియం ముందుకు పోయి నిరసన తెల్పుతున్నదానికి విలువలేనట్టు తమ స్థానాల్లో ప్లకార్డులుపట్టుకున్న టిడిపి సభ్యుల సంగతే పదే పదే స్క్రోలింగ్‌లు రావడం. వైసీపీ నచ్చినా నచ్చకపోయినా వారి ఎంపిల పాత్రను కూడా గుర్తించనవసరం లేదా అద్యక్షా? శాసనసభలో హౌదాపై ఏకగ్రీవ తీర్మానం చేయలేదా అద్యక్షా? హౌదా విషయంలో అందరి భావం ఒకటే అయినప్పుడు మిత్రపక్షంగా మిగిలిపోయిన తన బదులు ప్రతిపక్షాలు చేస్తున్నందుకు హర్షించవలసింది పోయి ఖండించడం విమర్శించడం రాష్ట్రానికి మేలు చేస్తుందా కీదు చేస్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *