రాజ్యసభ వ్యూహం , టిడిపి పై బాణం?
రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సంబంధించి అవరోధాలు ఎదుర్కొంటున్న బిజెపి ఇప్పుడుజరిగే ఎన్నికల తర్వాత కొంత మెరుగుపడాలని ఆశిస్తున్నది. పదవీ విరమణ చేస్తున్న మొత్తం 57 మందిలోనూ బిజెపి వారు 14 మంది వుంటే కొత్తగా 18,19 మందిని గెలిపించుకోవచ్చని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆదివారం పలువరు సీనియర్ నేతల పేర్లను ప్రకటించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఈ విషయంలో ప్రత్యేక రాజకీయ కోణం వుంది.
సీనియర్ నేత వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి, సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ను కర్ణాటక నుంచి నామినేట్ చేయాలని బిజెపి చేసిన నిర్ణయం తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక గట్టి సంకేతమే. నిర్మలను ఎపి నుంచి పంపించకపోవచ్చని అనుకుంటున్నదే. అయితే ఆ స్థానంలో వెంకయ్యనాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకునే అవకాశం వుందని చెబుతూ వచ్చారు. . మూడు సార్లు కర్ణాటక నుంచి వెళ్లిన వెంకయ్య నాయుడు ఈ దశలో రాజ్యసభ కోసం ఇక్కడకువచ్చాననిపించుకోవడానికి ఇష్టపడరనేది ఒకటైతే ప్రత్యేక హౌదా విషయంలో విమర్శలు వస్తాయనేది మరో ముఖ్య కారణం. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ఆ తర్వాత కూడా బిజెపి మమ్ముల్ను రాజ్యసభ విషయమై కోరలేదని చెప్పారు. అయినా కేంద్ర బిజెపి నేతలు బహిరంగంగా ఎలాటి ప్రతిపాదన చేయకపోవడం గమనించదగ్గది. రాజ్యసభ ప్రకటన వచ్చిన రోజున హెచ్ఎంటివి చర్చలో నేను నిర్మలను పంపించకపోవ్చని అంటే బిజెపి ప్రతినిధి నమ్మలేనట్టు నవ్వారు.కాని ఇప్పుడు జరిగింది అదే . సురేష్ ప్రభును పంపించవచ్చునని ఇప్పటికి ఒక పెద్ద పత్రిక రాస్తున్నది వారి ప్రయత్నమో లేక ప్రతిపాదనో కావచ్చు . నిర్మలా సీతారామన్కు ఇక్కడ సీటు అడగకపోవడం ద్వారా బిజెపి నాయకత్వం తెలుగుదేశం నుంచి కొంత విముక్తి పొందాలనుకుంటున్నది. ఇకపైన రాష్ట్ర రాజకీయాలలో ఇరుపార్టీల వైరుధ్యాలు పెరుగుతాయి.అస్సాం తర్వాత అమిత్షా ఆశిస్తున్న మిషన్ 7స్టేట్స్ వ్యూహం ఇందుకు కారణం.
ప్రభుత్వంలో కొనసాగినా బిజెపి రాజకీయంగా విమర్శలు పెంచుతుంది . ే టిడిపిపై దాడి చేసే వారిని ప్రోత్సహించుతుంది. వారు దూకుడుగా వెళుతున్నా చంద్రబాబు మాత్రం సన్నాయి నొక్కులు సర్దుబాటు ధోరణులకే పరిమితం కావడం ప్రజలే గాక పార్టీవారు కూడా తట్టుకోలేని దశ వస్తుంది. ఎన్నికలు దగ్గర పడ్డాక గొంతు పెంచితే సరిపోతుందనుకుంటున్న ఆయన ఆలోచన బెడిసికొటొచ్చు. ఇవన్నీ గాక ఇందులో మరో కోణం కూడా వుండొచ్చు. లోపాయి కారి అవగాహనతో ఉభయులూ సాగిస్తున్న ప్రహసనమే అయితే అదీ తేలకుండా వుండదు.ఈ రెండవ కోణంలో పరస్పర అవగాహనతో సాగించే ప్రహసనం అని భావించేట్టయితే సురేష్ ప్రభును ప్రతిపాదించడంలోనూ ఒక వ్యూహం వుండే అవకాశముంది. ఎలాటి పెద్ద ఖర్చు లేని రైల్వేజోన్ను కూడా మంజూరు చేయని ఆయన ఎంపికకు తెలుగుదేశం సహకరిస్తే రేపు జోన్ను ప్రకటించేసి అదే గొప్ప ఘనతగా కొంతలో కొంత సాధించినట్టు ప్రసాదించినట్టు ఉభయులూ ప్రచారంచేసుకోవచ్చు.