ఈడీ కోర్టు కీలక నిర్ధారణ , రు.749 కోట్ల జగన్ ఆస్తుల స్వాధీనం
రు.749 కోట్ల విలువైన మేరకు వైసీపీ అద్యక్షుడు జగన్కు సంబంధించిన వివిధ సంస్థల ఆస్తులను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట డైరెక్టరేట్(ఇడి) ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులివ్వడం రాజకీయంగా ఆ పార్టీకి పెద్దదెబ్బే. ఈ కేసుల్లో పెద్ద పురోగమనం లేకపోవడంపై తాము కోర్టుకు వెళతామని తెలుగుదేశం నేతలు చెబుతున్న సమయంలో ఇలాటి ఉత్తర్వులు రావడం వారికి వూరట కలిగించవచ్చు. జూన్లో చేసుకున్న స్వాధీనంపై నవంబర్ 11న ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను ఇప్పుడు ఇడి ప్రత్యేక విభాగం ధృవపర్చింది. ఇందులో ముఖేష్ కుమార్ చైర్మన్గా గల ఈ ధర్మాసనంలో న్యాయ నిపుణుడు తుషార్ షా, పాలనావ్యవహారాలకు సంబంధించిన దేవేంద్ర సింగ్లు సభ్యులుగా వున్నారు. జగన్పై ఇతర కేసులు పెట్టుబడులు ఎలా వున్నా మనీ లాండరింగ్ ఆరోపణలు మాత్రం తీవ్రమైనవేనని వాటిని ఇడి తీవ్రంగా తీసుకుంటుందని గత కొన్నేళ్లుగా ఆ పార్టీకి చెందిన న్యాయనిపుణులతో సహా అనుకుంటున్న విషయమే. ఎందుకంటే పెట్టుబడులు పెట్టిన వారి ఉద్దేశాలను లేదా క్విడ్ ప్రో కోలను నిరూపించడం తేలికకాదు.కాని నిధుల మళ్లింపును లావాదేవీలను నిర్ధారించడం తేలిక. పైగా ఈ విషయంలో ఇడి అధికారాలు తిరుగులేనివి కూడా. సండూర్ పవర్ కార్పొరేషన్, క్లాసిక్ రియాల్టి లిమిటెడ్,సరస్వతి పవర్ కార్పొరేషన్, సిలికాన్ బిల్డర్స్ వంటి సంస్థల ఆస్తులు వున్నాయి. కూలంకషంగా పరిశీలించిన మీదట జగన్
, ఆయన భార్య భారతి తదితరులకు సంబంధించిన సంస్థల లావాదేవీలలో అవకతవకలు జరిగాయని ఈ ఆస్తులు నగదు వాటినుంచే వచ్చాయని కోర్టు పేర్కొంది. జగన్లోటస్పాండ్నివాసంతో సహా అనేక భవనాలు భూములు కూడా ఈ జప్తు వుత్తర్వులో వున్నాయి. నిన్న విజయవాడలో వున్నప్పుడు చూస్తే ఆంధ్రజ్యోతి ఈ వార్తను బ్యానర్గా ఇచ్చింది. మామూలు కన్నా భిన్నంగా జగన్ కేసులో ఆస్తులు తన ఖాతాలోవేసుకోవడం జరిగిందని ముక్తాయించింది. గతంలో ఇలాటి వార్తలతో మొదటి పేజీ నింపేసిన చరిత్ర గల ఈనాడు అంత ప్రాధాన్యత ఇవ్వకపోగా లోపల ఎక్కడో డబుల్ కాలమ్లోనే ఇచ్చింది. నాటకీయత కూడా తక్కువగానే వుండింది. ఈ రోజు హిందూ వెబ్సైట్లో కూడా రాష్ట్రాల వార్తల కింద దీన్ని ప్రముఖంగా ఇవ్వడమే గాక ఈడీ ప్రత్యేక కోర్టు వ్యాక్యాలను యథాతథంగా ఇచ్చింది. అటాచ్మెంట్ అంటే స్వాధీనమా లేక స్తంభనా అనేదానిపై గతంలో చాలాచర్చ చేశాము.ఇప్పుడు ఈ తీర్పు ప్రకారం చూస్తే దాదాపు స్వాధీనం చేసుకోవడమే గాక ఇడి ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించినట్టు కనిపిస్తుంది. ఇలా జరగకుండా ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకోవడానికి జగన్తరపు న్యాయవాదులు సెలవురోజైనా శనివారంనాడు గట్టిగా ప్రయత్నం చేసినా ఉపశమనం లభించలేదు.ఇప్పుడు వారు ఏం వివరణ ఇస్తారో పై కోర్టులలో ఏ విధమైన పోరాటం చేస్తారో చూడాలి. ఈ లోగా టిడిపి వైసీపీ విమర్శల యుద్ధం ఎలాగూ తప్పదు.