ఇక పూర్తిగా రాహుల్ నాయకత్వమే!
నవంబరు7న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ రాలేకపోతే ఉపాద్యక్షుడు రాహుల్గాంధీ అద్యక్షత వహించడం.. ఆ సమావేశం ఆయన అద్యక్ష పదవి తీసుకోవాలని తీర్మానించడం అంతా వూహించినట్టే వుంది. ఏది ఏమైనా 46 ఏళ్ల రాహుల్ గాంధీ ఇక నేరుగా పార్టీ సారథ్యం స్వీకరించడం ఖాయమైనట్టే.ఆయన కూడా బిజెపి మతరాజకీయాలపై గట్టిగా పోరాడాలని భారత దేశం అనే భావన కాపాడాలని చెప్పారట. పదవీ బాధ్యతలు కార్యకర్తలు ఎలా కోరుకుంటే అలాగే నని తలూపడం ద్వారా గతంలో చూపిస్తున్న వైముఖ్యాన్ని విడనాడారన్నమాట. ఈ వివరాలు సీనియర్ నాయకుండు ఎకెఆంటోనీ వెల్లడించారు. సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ కూడా రాహుల్ రాక అవసరాన్ని నొక్కి చెప్పారట. తీర్మానం సారాంశాన్ని సోనియాకు తెలియజేస్తామని ఆమె తప్పక పరిగణిస్తారని ఆంటోనీ అన్నారంటే ఆమె ఆశీస్సులు లేకుండా ఇదంతా జరగదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని మొద్దబ్బాయి అనీ బాధ్యతలకు భయపడుతున్నాడని అనే అవకాశం వుండదు. అయితే మరోవైపున ప్రధాని మోడీని ఆయననూ పోటీ పెట్టి ఎవరు మెరుగో చూడండని ప్రచారం చేసుకునే అవకాశం బిజెపికి లభిస్తుంది. ఏమైనా దేశంలో పురాతనమైన పార్టీలో ఆరోతరం నెహ్రూ వంశ వారసుడి నాయకత్వం మరింత బలపడుతుంది. అయితే ఆయన మూడోసారి ఎంపిగా ఎన్నికై చాలా కాలంగా పార్టీ విధాన నిర్ణయాలలో భాగం పంచుకుంటున్నారు గనక ఈ నిర్ణయంలో ఇతరులు తప్పు పట్టడానికి వుండకపోవచ్చు. అయితే రాహుల్ కాయకల్ప చికిత్సతో కాంగ్రెస్ పునురుజ్జీవం పొందుతుందా అంటే కష్టమే మరి? కాని బిజెపి మత రాజకీయాలపై వ్యతిరేకత వల్ల కొంత మేలు కలగొచ్చు.
ఇంతకూ రాహుల్ వారసత్వం అనివార్యమే అయినా పార్టీలో ఒక వర్గం ఆయన బదులు ప్రియాంక గాంధీని తేవాలని చాలా ఒత్తిడే తెచ్చింది. రాహుల్ గాంధీ కాస్త ఆలస్యమైనా పాత కాలపు కాంగ్రెస్ తరహా నినాదాలు తీసుకోవాలని లౌకికతత్వం సామాజిక న్యాయం వంటి అంశాలతో ముందుకు పోవాలని చెప్పడం కొన్ని బలీయమైన వర్గాలకు నచ్చడం లేదట. ఈ కారణంగానే ఆయనకు నాయకత్వ మార్పిడి ఆలస్యమైందని కాంగ్రెస్ వర్గాలుచెబుతున్నాయి. రాహుల్గాంధీ మంచివైపే నడిపిస్తారని అయితే దానికి ముందు ఆయన విషయాలు నాన్నడం మానుకోవాలని పార్టీలోని ఆయన అభిమానులంటున్నారు.
