అయుధంగానే నయీం కేసు

రెండు మాసాల పాటు మీడియా మోతగా మేతగా నడిచిన గ్యాంగ్స్టర్ నయీం కేసులో నాటకీయ పరిణామాలేమీ వుండే సూచనలు కనిపించడం లేదు.టిఆర్ఎస్ పాలనా వ్యవస్థకు బాగా దగ్గరగా వుండే ఒక ప్రజా ప్రతినిధి ఈ సంగతి స్పష్టం చేశారు. ఇప్పటికే రచ్చకెక్కిన నేతి విద్యాసాగర్ వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే రాజకీయంగా ఎవరిపైన బహిరంగంగా చర్యలు వుండే అవకాశం లేదని ఆయన వివరించారు.ఓటుకు నోటు కేసు తెలుగుదేశంపై ఆయుధంగా ఉపయోగించినట్టే ఇది కూడా మా అధినేతకు అంతర్గత ఒత్తిడికి ఆయుధంగా వుంటుందని తెలిపారు. అంటే దాంట్లో పేర్లున్న లేదా ఆధారాలున్న నేతలను కట్టడి చేయడానికి అవసరమైనప్పుడు తప్పించడానికి లోలోపల రాజకీయం నడుస్తుందన్నమాట. అసలే అప్రతిహతంగా అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఇలాటి ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో బాగా తెలుసని ఆయన అన్నారు.అయితే అదే సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన వారి పేర్లు బయిటపెట్టడం జరుగుతుంటుంది.
ఈ కేసులో ఫిర్యాదుల ఆధారంగానే రాజకీయ చర్యలు తీసుకోవడంలో సమస్యలు కూడా వున్నాయని టిఆర్ఎస్ నాయకులంటున్నారు. ఒక దశలో ప్రతివారూ నయీం తమ స్థలం ఆక్రమించాడని ఫిర్యాదు చేశారని నిజానికి ఆరోజుల్లో వాటికి అంత విలువ గాని ప్రాధాన్యత గాని లేవని చెబుతున్నారు. పోలీసులు కూడా రకరకాల పద్ధతుల్లో ఫిర్యాదులు సేకరించారని చేయించారని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. బాధితులకు నిందితులకూ తేడా లేని స్థితి కూడా చాల చోట్ల వుంది.కాబట్టి ఆచితూచి అడుగేయవలసిందే. సంచలనాలేమీ వుండవు.పట్టుబడిన దుండగులను బాహాటంగా దొరికిన వారిని శిక్షించడం జరగొచ్చునని అంటున్నారు. 24 గంటలకు మించి ఒక వార్తకు విలువ వుండని నేటి పరిస్తితుల్లో నయీం వార్త వెనక్కుపోయినట్టే. బిజెపి అద్యక్షుడు అమిత్ షాకు సంబంధించిన అంశాలు గల కేసులోనూ నయీం పేరు వున్నందున దాన్నిఎంత త్వరగా మూసేస్తే అంత మేలని వారూ అనుకుంటున్నారట.