జగన్ వ్యూహాత్మక ఎజెండాతో కొత్త మలుపు
ప్రత్యేక హౌదా కోసం పార్లమెంటులో పోరాడి కేంద్రం అప్పటికీ ఇవ్వకపోతే తమ ఎంపిలు రాజీనామా చేస్తారని వైసీపీ అద్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించడం వ్యూహాత్మకమైన నిర్ణయంగా మారనుంది. గతంలో ఇదే సమస్యపై శాసనసభలో జరిగిన రభసకు సంబంధించి తమ ఎంఎల్ఎలను సభా హక్కుల సంఘం విచారిస్తున్న రోజునే ఈ ప్రకటన చేయడం ద్వారా వైసీపీ అధినేత ఉభయత్రా ప్రయోజనం సాధించాలని భావించారు. అక్కడ వారు కూడా ఇదే సమాధానం ఇవ్వడంతో పాటు రాజీనామాలకు కూడా సిద్ధమైతే ఎజెండా నిర్ణయం ప్రతిపక్షం ఎజెండాకు ప్రభుత్వం తెలుగుదేశం స్పందించాల్సిన స్థితి ఏర్పడుతుంది. గతంలో ఈ విషయమై సంకేతాలు మాత్రమే ఇస్తున్న జగన్ ఈసారి సూటిగానే ముందుకు రావడం వెనక జనసేన అధినేత పవన్కళ్యాణ్ వ్యాఖ్యల ఫ్రభావం కూడా వుండొచ్చు. ప్రత్యేక హౌదా కోసం ఎంపిలు రాజీనామాలు చేస్తారా అని పవన్ సవాలు విసిరారు గనక ఆయనకూ ఇది సమాధానంగా వైసీపీ భావించవచ్చు ప్రత్యేకహౌదాపై పోరాటంలో చొరవ తమ చేతుల్లోనే వుండేలా చేసుకోవాలంటే ఈ సవాలు విసరాలని జగన్ భావనగా కనిపిస్తుంది. కర్నూలులో జరిగిన యువభేరి కార్యక్రమం వేదికగా జగన్ చేసిన ఈ ప్రకటన రానున్న కాలంలో ప్రధాన చర్చకు దారితీయడం అనివార్యమవుతుంది. ఒకవేళ తెలుగుదేశం నేతలు ఆయనపై ఏ విధమైన దాడి చేసినా రాష్ట్ర సమస్య గనక రాజకీయంగా అనుకూలత అటే వుంటుంది.విభజన సమయంలో నాటి కేంద్రంలోని కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కలసి ఇచ్చిన ప్రత్యేక హౌదా వాగ్దానాన్ని భగం చేయడంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వున్న మాట నిజం.ఈవిషయంలో పరిపరి విధాల మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ఇటీవల ప్రకటించిన అరకొర ప్యాకేజిని స్వాగతించేశారు. దానికి కారకుడంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును ఆకాశానికెత్తేశారు.దీనిపై నిరసనలు ఉద్యమాలు వచ్చినా పట్టించుకోలేదు. ఇది ముగిసిన అధ్యాయమేనన్నట్టు ప్రభుత్వం చెప్పుకుంటున్న సమయంలో ప్రధాన ప్రతిపక్షం ఎంపిలతో రాజీనామా చేయిస్తాననడం తప్పక ప్రభావం చూపిస్తుంది. . ఎంపిల వరకే రాజీనామా అన్నారు గనక రాష్ట్ర స్థాయి నిర్ణయం మరో దశలో చూస్తామని కూడా చెప్పే అవకాశం
వుంటుంది. ప్రభుత్వాన్ని సవాలు చేసే అవకాశమూ వస్తుంది.
ఒక్కసారి వెనక్కు వెళితే గత శాసనసభలో వైసీపీలో చేరిన కాంగ్రెస్ తెలుగుదేశం ఎంఎల్ఎలు ఒకవైపు, తెలంగాణ విభజన ఉద్యమంకోసం టిఆర్ఎస్ నేతలు మరోవైపు రాజీనామాలు చేయడం ఉప ఎన్నికలకు కారణమైంది. ఆ ఎన్నికల్లో విజయ పరంపరలే వైసీపీ విశ్వాసం పెంచాయి. సాధారణ ఎన్నికల్లోనూ ఢఅంటే ఢ అనే స్తితిని తెచ్చాయి. ఇప్పుడు రాజీనామాలు ఉప ఎన్నికలూ అంటే తదుపరి సమీకరణలకు రంగం సిద్ధం చేసినట్టవుతుంది . ఇది ఖచ్చితంగా ఏ రూపం తీసుకుంటుందో చెప్పడానికి మరి కొద్ది నెలలు చూడవలసిందే. ప్రజలూ ముఖ్యంగా యువత దీన్ని స్వాగతిస్తారని చెప్పొచ్చు.