వైసీపీ అనుకూలత ఓవర్ ప్లే..?
ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని సైట్లు ఇస్తున్న కథనాలు వైసీపీవైపు చాలామంది ప్రముఖులు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నాయి. ఆఖరుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అటే చూస్తున్నారనేలా వుంటున్నాయి. తాజాగా జయప్రకాశ్ నారాయణ్ కూడా అదే భావన వ్యక్తం చేశారని ఒక కథనం చూశాను. జగన్పై దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు నాయుడు డబ్బులిచ్చారని జయసుధ చెప్పినట్టు మరో కథనం. ఇవన్నీ ప్రచురించిన సైట్ పేరు గుర్తు లేదు గాని మొత్తంపైన టిడిపి మీద విమర్శలు వైసీపీ వైపు మొగ్గు వీటి సారాంశం. టీడీపీ ఎంత హైటెక్ అనుకున్నా సరే సోషల్ మీడియాలో వైసీపీదే పై చేయి అని గతంలోనే చెప్పుకున్నాం. ఈ వరుస కథనాలు చూస్తుంటే వైసీపీ అభిమానులు మరో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తుంది. ఇదంతా నిజమేనా కాదా వారి మాటలను ఈ సైట్లు అతిగా అంచనా వేసి తమ స్వంత భాష్యం చెబుతున్నాయా అనేది పరిశీలించాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కువ సార్లు ఆ కథనాల్లో వారు రాసింది వుంటుంది తప్ప వీరు చెబుతున్న క్లిప్పింగు గాని పేపర్ కటింగు గాని వుండదు. కాబట్టి నిర్ధారించుకునే అవకాశం వుండదు. జెపి వరకూ వచ్చింది నిజమేనా అని ఆయన సన్నిహితులను అడిగినప్పుడు అలా వైసీపీ వైపు మొగ్గే అవకాశం లేదని వారన్నారు. నిజానికి లోక్సత్తా పదవ వార్షికోత్సవ సమయంలో ఆయన చెప్పింది పత్రికల్లో వచ్చింది కొంత తేడాగా వుందని కూడా వారు వివరించారు. ఎన్నికల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని ఆయన చెప్పలేదని గతంలో పలితాలు ఇవ్వలేదు గనక విరామం ప్రకటించామని మాత్రమే చెప్పారని స్పష్టం చేశారు. నిజానికి జెపి కమ్యూనిస్టులతో కలసి పనిచేసే అవకాశాల గురించి గతంలో అది జరక్కపోవడం గురించి ఎక్కువగా మాట్లాడారట.
ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పాత్రను తప్పక గుర్తించాల్సిందే. వారు ఉద్యమాలు నడపాలనీ కోరుకోవలసిందే. అయితే ప్రభుత్వంపై వచ్చే విమర్శల్లో కొన్ని వారిపైనా వున్నాయి. నిజానికి ఆ పార్టీ నాయకులు ప్రతినిధులు చాలా మంది అదినేతలో ఇంకా రావలసిన మార్పు రాలేదని అంటుంటారు. ఇవి సవరించుకుని లోపలి అసంతృప్తిని పోగొట్టేబదులు బయిటవారి గురించి కథనాలు ప్రచారం చేసుకోవడం వల్ల ఫలితం వుండదనేది నిజం. ఇక వీటికి పోటీగా టిడిపి విస్త్రతంగా కథనాలు వదిలేందుకు సిద్దమవుతున్నట్టు కనిపిస్తుంది.
