ఆరెస్సెస్,రామబాణం.. సైన్యం జపం- శ్రుతిమించిన హిందూత్వ వ్యూహం
బారత సైన్యం శౌర్యప్రతాపాలను, త్యాగాలనూ రాజకీయ ప్రచారానికి వాడుకోవద్దంటే నరంద్రమోడీ ప్రభుత్వానికి బిజెపి నాయకత్వానికి ఎక్కడ లేని కోపం వస్తుంది.దీనిపై నేను గతంలోనే వ్యాఖ్యానించాను.కాని ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడేకొద్ది ముసుగులన్నీతీసేసి మరీ వారు రాజకీయ వ్యూహాలతో చెలరేగిపోతున్నారు. మోడీ జైశ్రీరాం నినాదమివ్వడం ఒకటైతే రామాయణ గాధలు తీసుకుని టెర్రరిజంపై పోరాడాలని చెప్పడం మరొకటి. ఆ పైన అయోధ్యలో రాముడి మ్యూజియం ఏర్పాటుకు సాంసృతిక శాఖ సన్నాహాల్లో భాగంగా కేంద్రమంత్రి మహేష్ శర్మ అయోధ్య వెళ్లడం..ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అండదండలతో శ్రీమాతేశ్వరీ ఆలయంలో రాష్ట్ర రక్షణ యజ్ఞం 21 మంది దేశభక్త బ్రాహ్మణులతో నిర్వహించడం.. క్షత్రియులు యుద్ధం చేస్తే బ్రాహ్మణులు యజ్ఞాలద్వారా మద్దతు తెల్పడం ఈ దేశంలో ముందు నుంచి వుందని సంసృత అకాడమీ చైర్పర్సన్ జయదావే పరవశం! ఇక రక్షణ మంత్రి మనోహర్ పరిక్కర్ అయితే అప్పుడెప్పుడో రామా
యణంలోనే హనుమంతుల వారు చూసిరమ్మంటే కాల్చిరావడం సర్జికల్ స్ట్రైక్స్ వంటిదేనని విశ్లేషించడం.. అయితే రాముణ్ణి హనుమంతుణ్ని పొగిడితే తమ అసలు బాస్లకు సంతోషం ఎలా కలుగుతుందని మళ్లీ సందేహం వచ్చిందేమో! ఆరెస్సెస్ ప్రేరణతోనే ఇది జరిగాయని చెప్పి సంఘభక్తిచాటుకున్నారు.ఇవన్నీ చూస్తుంటే ఈ దేశం ఎటు పోతుందో లౌకిక తత్వం మతాతీతం వంటి మాటలు ఎలా మట్టికొట్టుకుపోతున్నాయో అర్థం కావడం లేదూ?
రాజకీయాల్లో మతాన్ని జొప్పించడమే సరికాదంటుంటే ఏకంగా సైన్యం చర్యలకు కూడా మత గ్రంధాలను పురాణాలను తీసుకొచ్చి పోలికలు చెప్పడం రాముడూ ఆరెస్సెస్ భజన చేయడం ఏం రాజ్యాంగం? ఏం రాజకీయం?
ప్రధాని మోడీ ఇక్కడివరకైనా ఆగివుంటే అదో రీతిగా వుండేది. హిమచల్ ప్రదేశ్ ప్రసంగంలో ఆయన సర్జికల్ స్ట్రైక్స్ను ఇజ్రాయిల్ సైన్యం దాడులతో పోల్చారు. ప్రపంచంలోనే అతి కిరాకతంగా పాలస్తీనా విమోచన పోరాటంపై దాడి చేసే ఇజ్రాయిల్ను మనకు ఆదర్శంగా చెప్పడం ద్వారా జాత్యహంకార నమూనాను కీర్తించడం బిజెపి స్వభావానికి బాగా సరిపోతుంది. కాని చిరకాలం పాలస్తీనాను బలపర్చిన ఈ దేశం వరవడికి మాత్రం అది పూర్తి విరుద్ధం. మన అలీన ప్రతిష్టకు కళంకం.అయితేనేం ఈ ప్రభుత్వానికి అవన్నీపట్టవు. పెద్ద రాష్ట్రం ఎన్నికలలో అత్యధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి గనక ఇంకా ఇంకా రెచ్చిపోయే ప్రమాదముంది.
