జిల్లాల సంరంభంలో సిద్ధిపేట సైడ్ లైట్స్
తెలంగాణలో నూతన జిల్లాల ప్రారంభ సంరంభంతో దసరా ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన, పోరాటాలు నడిపించిన సిద్ధిపేట జిల్లాను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంచుకోవడం వల్ల దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకృతమైంది. మామూలు మాటలు అలా వుంచితే ఈ సందర్భంలో కెసిఆర్ ప్రసంగం ఉద్వేగం, పెద్దరికం మేళవింపుగా నడిచిందని చెప్పాలి. ఆయన తర్వాత నియోజకవర్గ బాధ్యత తీసుకుని అసమాన ఆధిక్యతతో వరుస విజయాలు సాధించిన హరీష్ రావు కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు గనక కెసిఆర్ ఒకటికి రెండు సార్లు ఆయన గురించి అభినందనా పూర్వక ప్రస్తావనలు చేస్తూ ఆశీస్సులందించారు. తన తర్వాత ఆయన ఈ ప్రాంతాన్ని స్వర్గసీమగా తీర్చిదిద్దేందుకు గొప్పగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు. ఆ సమయంలోనే మీ బిడ్డ తెలంగాణకంతటికీ నీళ్లిచ్చే పనిచేస్తున్నాడని, భవిష్యత్తులో మరింత సేవ చేసేందుకు మీ ఆశీస్సులు కావాలని అన్నారు. తన ఉద్యమ ప్రస్థానాన్ని అనుబంధాన్ని కూడా పదేపదే గుర్తు చేసు
కున్నారు. కొంతమంది అవాకులు మాట్లాడుతున్నా పండుగ పూట గనక సమాధానం తర్వాత ఇస్తానంటూ వదిలేశారు. హరీష్ కెటిఆర్ ల గురించి నిరంతరం చర్చించే వారు ఈ సభపై కొంత ప్రత్యేక దృష్టి పెట్టడం సహజం. వారికి అవకాశం ఇవ్వకుండా కెసిఆర్ సుహృద్భావం కురిపించారు. ప్రారంభోత్సవ ఘట్టంలోనూ వెనక వున్న హరీశ్ను ప్రత్యేకంగా పిలిచి భాగం కల్పించారు. అయితే హరీశ్ఫై ఆయన ప్రశంసలు సిద్దిపేట అభివృద్ధి, నీటి పారుదల శాఖల వరకే పరిమితం కావడం నిజం. సభికులు మాత్రం ఉభయ నేతల ప్రస్తావనలు వచ్చినప్పుడల్లా భారీగా స్పందించారు. వారు రావడానికి ముందు హరీశ్ను మిస్టర్ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఈ స్పందన మరింత ఎక్కువగా కనిపించింది. సహజంగానే హరీశ్ తన ప్రసంగంలో కెసిఆర్ ఘనతను గొప్పగా శ్లాఘించారు. మిగిలిన చాలామంది మంత్రుల్లా స్వంతంగా జిల్లా ప్రారంభించకుండా ముఖ్యమంత్రితో పాల్గొనడం వల్ల హరీశ్లో వినయం సంతోషం రెండూ కనిపించాయి.
