దాంపత్యంలో అవగాహన.. అసహనం

పెళ్లయిన కొత్తలో భర్త మాట్లాడతాడు భార్య వింటుంది, తర్వాత భార్య మాట్లాడుతుంది భర్త వింటాడు ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడతారు వీధిలో వాళ్లు వింటారు అన్న చలోక్తి చాలా కాలంగా చలామణిలో వుంది. హాస్యం కోసం కనక ఫర్వాలేదు గాని ఇందులో ఆలోచించవలసిన అంశాలు చాలా వున్నాయి. ఇంతకూ భార్యా భర్తల వాదోపవాదాల తీవ్రత ఎంతగా వుంటుందో మాత్రం దీన్ని బట్టి తెలుస్తుంది. గట్టిగా మాట్లాడటం, మాట్లాడక పోవడం మాత్రమే ఇక్కడ సమస్య కాదు.
అన్యోన్య దాంపతష్ట్ర్్జూ://స్త్రశీశీ.స్త్రశ్రీ/ఖీజీన0ఙస్య జీవితానికి సంబంధించిన సూత్రాలు, వైవాహిక శాంతికి సంబంధించిన కథలు చాలా వున్నాయి. భార్యను లేదా భర్తను లొంగదీసుకోవడం ఎలా వంటి పుస్తకాలు చాలా కాలంగా వుంటున్నాయి. ఇవన్నీ హాస్యాస్పదమైనవే గాక హానికరమైనవి కూడా. జీవితాంతం పెనవేసుకున్న ఒక అపురూప అనుబంధంలో ఆధిక్యతల ప్రశ్న రానేకూడదు. మనది పురుషాధిక్య సమాజం గనక ఆ మేరకు భార్యలు ఎలాగూ సర్దుకుంటూనే వుంటారు. దాన్ని పక్కన బెడితే దైనందిన వ్యవహారాలలో కీలక విషయాలలో పరస్పరం అవగాహన పెంచుకోవడం ఎలా అసహనం నివారించుకోవడం ఎలా అన్నది ఆలోచించవలసిన విషయం.
మొదట్లో అనుకున్నట్టు ఎవరి మాట ఎవరు వినాలన్న ప్రశ్న రానేకూడదు. ఎవరు చెప్పేది సరైందైతే ఎవరు సకాలంలో సరైన మాట చెప్పగలిగితే దాన్ని అవతలి వారు వినాలి. ఈలోగా జరిగే తర్జనభర్జనల్లో ఓర్మి వహించాలి. ఎందుకంటే పరస్పరం మాట్లాడుకోకపోతే సరైన నిర్ణయానికి రావడం ఎవరి వల్లా కాదు. నిర్నయానికి వచ్చేముందు వివిధ కోణాల నుంచి పరిశీలన చేయడం తప్పని సరి. ఆ సందర్భంలో ఎవరికి తోచింది వారు చెబుతారు. అంతటితోనే కొంప మునిగిపోతుందని కోపతాపాలకు గురి కానవసరం లేదు. నీవెప్పుడూ ఇంతే నీవెప్పుడూ ఇంతే అని ఒకరినొకరు ఆడిపోసుకోవలసిన అవసరం అంతకన్నా లేదు.ఎందుకంటే భార్యాభర్తలకు ఎవరు ఏమిటో ఏ విషయంలో ఎలా స్పందిస్తారో ఏ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో పూర్తిగా అర్థమై వుంటుంది.(లేదా కావాలని అర్థం కాకుండా వ్యవహరిస్తారన్న సత్యమైనా తెలిసి వుంటుంది) అందువల్ల తెలిసిన దాన్నే మరోసారి పరీక్షకు పెట్టి నిర్ధారించుకుని దానిపైనే మళ్లీ కోపగించుకుని రసాభాస చేసుకోవలసిన అగత్యం ఎంత మాత్రం వుండదు.
తెలివి తేటలు, కుటుంబ నేపథ్యాలు, గ్రహింపులో తారతమ్యాలు,పట్టు విడుపులు పరిపక్వతలు వీటన్నిటిలో భార్య భర్తల మధ్య తేడాలు చాలా వుంటాయి. నూటికి నూరు పాళ్లు ఒకేలా వుంటామని ఢంకా బజాయించే దంపతులైనా సరే సమయాన్ని బట్టి భిన్నంగా స్పందించే అవకాశం ఎప్పుడూ వుంటుంది. రియాల్టి షోలు కృత్రిమమైనవైనా వుభయుల ఆలోచనల్లో వుండే తేడాలను చాలా సార్లు వెల్లడిస్తుంటాయి. అది అతి సహజమే గాక వాంఛనీయం కూడా. ఎందుకంటే ముందే కథ రాసుకున్నట్టు భార్యా భర్తలు ప్రతి దాంట్లోనూ ఒకే మాట సెలవిస్తుంటే ఒకే విధంగా ఆలోచిస్తుంటే ఇక కుటుంబంలో వైవిధ్యానికి గాని కొత్త కోణాల ఆవిష్కరణకు గాని అవకాశమే వుండదు. మామూలుగానే గానుగెద్దు వ్యవహారంతో పోల్చే మధ్య తరతి జీవితాలు మరింత యాంత్రికంగా మారిపోతాయి. పరస్పర గౌరవం ప్రజాస్వామిక తత్వం వున్నంత వరకూ ఎంతటి భిన్నాభిప్రాయాలనైనా ఆహ్వానించవచ్చు. కలసి మాట్టాడి పరిష్కరించుకోవచ్చు.
వృధా వాదోపవాదాలు మనస్తాపాలకు దారి తీస్తాయి. కనీసం తాత్కాలికంగానైనా కలత కలిగిస్తాయి. కొంతమంది హఠాత్తుగా స్తబ్దతకు లేదా సంఘర్షణకు గురవుతుంటారు. ముఖ్యంగా మహిళలు అసలు సమస్యకు అభద్రత తోడై ఇలాటి సందర్బాల్లో తల్లడిల్లిపోతుంటారు. వారి ఆభద్రతను పారదోలి ఆత్మ విశ్వాసం కలిగించేందుకు పతిదేవుళ్లు గాని కుటుంబ సభ్యులుగాని సహకరించరు. ఇంటా బయిటా వుండే శాడిస్టులు వారిని ఇంకా వేదనకు ఆందోళనకు గురి చేస్తుంటారు. ఇదంతా జరక్కూడంటే అన్యోన్య సంబంధాల్లో అపార్తాలు పెరక్కుండా జాగ్రత్త వహించాలి. సంభాషనా సరళి సక్రమంగా వుండేలా చూసుకోవడం అందుకు మొదటి మెట్టు.
అవతలి వారు చెప్పేది మన భావాలను అనుగుణంగా వుందా లేదా అని మాత్రమే గాక హేతుబద్దంగా వుందా అని చూడటం చాలా అవసరం. వారు తీవ్రంగా మాట్లాడుతున్నా అది విషయానికి పరిమితమా లేక మరేదైనా ఉద్దేశం వుందా అని పరిశీలించాలి. ఫలానా మార్గం వల్ల మంచి జరుగుతుందని నిజంగా నమ్మి చెబుతుంటే దాన్ని వెంటనే తోసిపుచ్చే బదులు వ్యవధి నిచ్చి పరిశీలించాలి. అంత వ్యవధి లేదనుకుంటే అప్పుడే వివరంగా అడిగి తెలుసుకోవాలి.నా మాట ఎప్పుడూ పడనివ్వరని, ఎడ్డెం అంటే తెడ్డెం అంటారని ఏవో పూర్వ నిర్ధారిత భావాలు పెట్టుకుని ముందే రెచ్చిపోకూడదు. నిజంగానే అవతలి వారు మొండిగా వున్నారనుకున్నా అప్పుడు మీరు మరింత నిబ్డరంగా వుండాలి తప్ప నిప్పులు కక్కడం వల్ల ఫలితం శూన్యం. అవతలి వారు ఫలానా విధంగా చెబుతారని ముందే అనుకుని అడగడం ఒకటైతే వారు ఫలానా కారణం వల్లనే ఇలా చెబుతున్నారని సందేహంతో స్పందించడం మరొకటి. వీటన్నిటి ఫలితం సంభాషణ సంవాదమై పోతుంది. ఎక్కువగా చెప్పడం కన్నా ఎక్కువగా అడగడం, పరోక్ష ప్రశ్నలతో అపనమ్మకాన్ని వెల్లడించడం చాలా సార్లు ఘర్షణకు దారి తీస్తుంటుంది.
త్రీ డీ చిత్రంలో వలె జీవితానికి పొడవు వెడల్పుతో పాటు లోతు కూడా వుంటుంది. నలుపు తెలుపుతో పాటు సప్త వర్ణాలు వుంటాయి. కనక ప్రతి విషయంలోనూ ప్రతివారూ ఒకేలా ఆలోచించాలని లేదు. అందులోనూ జీవితాంతం సహ జీవనం చేసే భార్యాభర్తలు నిస్సంకోచంగా తమ మనసులో భావాలు బహిర్గతం చేసే అవకాశం ఇచ్చుకోవాలి. మళ్లీ ఒకసారి స్త్రీకోణం చెప్పాలంటే భార్యకు మనసులో భావాలను వెల్లడించే అవకాశం ఒక పిసరు ఎక్కువగా ఇవ్వాలి(తర్వాత ఎలాగూ గదమాయించడం లేదా వీటో చేయడం వుండనే వుంటుంది ) అధికారంతోనో అభద్రతతోనో దాన్ని అడ్డుకుంటే అప్పుడు అశాంతి పెరగుతుందే తప్ప తగ్గదు. కుటుంబ జీవితంలో అసౌఖ్య వాతావరణం ఏర్పడిన తర్వాత జీవిత శాంతి సగమైనా అవిరవుతుంది. అభిమాన పూర్వకమైన రీతిలో అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం వల్ల అశాంతి మటుమాయమై పోవడమే గాక ఆహ్లాదం పరుచుకుంటుంది.