కాపు నేతల వ్యూహం, రాజకీయ ప్రధానం

గతంలో జరిగిన పొరబాట్లు పునరావృతం కాకుండా ఈ సారి పూర్తిగా సమిష్టి పద్ధతుల్లో ముందుకు నడవాలని కాపు నేతలు గట్టిగా భావిస్తున్నారు. ఇటీవల దాసరి నారాయణరావు ఇంట్లో సమావేశమైనప్పుడు తమ మద్య ఈ మేరకు పూర్తి అవగాహన కుదిరిందని దాంట్లో పాల్గొన్న ముఖ్య నాయకులొకరు చెప్పారు. ఇది కుల పోరాటంగా క కాపులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్న దానిపైనే మా కేంద్రీకరణ వుంటుంది తప్ప వేరే దారికి వెళ్లనివ్వం అని ఆయన అంటున్నారు. ముద్రగడ పద్మనాభం కూడా తాను అందరికీ చెప్పిన తర్వాతనే అడుగు వేస్తానని, ఇంతకుముందు చేసినట్టు వ్యక్తిగత నిర్ణయాలు ఆవేశపూరిత ఉద్రేక పూరిత వ్యవహారాలకు అవకాశమివ్వబోనని చెప్పినట్టు తెలిసింది. రాజమండ్రిలో 11వ తేదీన జరిగే కుల సంఘ పెద్దలసమావేశంలో కార్యాచరణ నిర్ణయించి మళ్లీ అందరికీ నివేదిస్తారట. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది చర్చించి తదుపరి వ్యూహం నిర్ణయిస్తారు. కాపుల పేరిట జరిగినా ఇది వాస్తవంలో చంద్రబాబుపై పెరుగుతున్న అసంతృప్తిని సమీకరించే క్యాటలిస్టుగా పనిచేస్తుందనేది ఆ నేతల అంచనా. గతంలో కాపునాడు, విజయవాడ ఘటనల వంటి వాటికి ఇప్పుడు చేయబోయే పోరాటానికి పోలిక వుండబోదని మరో నాయకుడు చెబుతున్నారు. పవన్కళ్యాణ్ రాకపోయినా ఆయన పట్ల కూడా గౌరవంగానే వుండాలన్న భావన వారిలో వుంది. తెలుగుదేశం నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు పవన్పై టిజి వ్యాఖ్యలను ఖండించడంలోనూ ఇదే కనిపిస్తుందంటున్నారు.