నయీంపై దినేష్ దాటవేత – బిజెపి సాచివేత

నేరసామ్రాట్ నయీం ఉదంతంపై మాజీ డిజిపి దినేష్రెడ్డి బిజెపి తరపున మాట్లాడుతున్నట్టు మీడియాలో చూశాను. దీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి అత్యున్నత బాధ్యతలు నిర్వహించిన ఆయన జరిగిన దానిపై ఎవరో సామాన్యులలాగే మాట్లాడ్డం తప్ప వ్యక్తిగతంగా గాని వ్యవస్థాగతంగా గాని ఒకింత బాధ్యత తీసుకోలేదు. హతం కావడాన్ని స్వాగతిస్తూ అందుకు అనుమతించిన ముఖ్యమంత్రి కెసిఆర్ను ప్రశంసించారు. అయితే అంతకు ముందు అనుమతినివ్వని వారిని విమర్శించబోనని అంటారు. ఇన్ఫార్మర్గా వున్న నయీంతో డిజిపి వంటి స్తాయి గల వ్యక్తులకు సంబంధం వుండదట.ఎన్కౌంటర్ వార్తలో ఫోటోలు చూసి మొదట ఎవరీ బఫూన్ అనుకున్నారట. తర్వాతనే అతను నయీం అని తెలిసిందట. ఉమ్మడి రాష్ట్ర డిజిపిగానూ ఇంకా అనేక రూపాల్లోనూ ఉన్నత బాధ్యతలు నిర్వహించిన ఐపిఎస్ అధికారి నయీం ఫోటో చూసిన తర్వాత కూడా పేరు వచ్చాక గాని తెలుసుకోలేకపోయానని చెప్పడం ఎంత హాస్యాస్పదం? మరెంత అభ్యంతరకరం? మామూలు పౌరులకు కూడా పరిచితమైన నయీం ఫోటో ఆయన ఎప్పుడూ చూళ్లేదా? రాష్ట్రాన్ని పీడిస్తు వందల వేల కోట్లు వసూలు చేస్తున్న ఒక మాఫియా డాన్ గురించి తెలుసుకోకుండా కేవలం ఇన్ఫార్మర్ ముద్రతో వదిలేశారా? అలాగైతే అతన్ని పట్టుకోమని ఆదేశాలు ఇచ్చానంటున్నారే ఎందుకు ఇచ్చారు?ఈ ప్రశ్నలకు జవాబులు లేవు. మురికివివాదాలు బహిరంగంగా మాట్లాడ్డం తనకిష్టం లేదంటూనే ఇష్టం లేని వారి పేర్లు హౌదాలు ప్రస్తావించారాయన. ఇప్పుడున్న డిజిపితో సహా అందరూ తన శిష్యులేనని కూడా ప్రకటించారు. గురువులపై శిష్యులు విచారణ జరపడం కష్టమైన విషయమని సమాజంలో సందేహాలు వస్తుంటాయి. ఆపూర్వాపరాలు ఎలా వున్నా వ్యాస్ హత్య జరిగినప్పుడు దూరంగా వున్నానని దాటేశారే గాని ఆ దర్యాప్తుకు సహకరించలేదన్న ఆరోపణకు సమాధానం లేదు. పైగా ఆ దర్యాప్తు అధికారిని తర్వాత వేధించారన్న ఫిర్యాదులున్నాయి. ఇంత జరిగాక కూడా నయీం ఉదంతం ఏదో మామూలు వ్యవహారమన్నట్టు మాట్లాడారే గాని పోలీసు వ్యవస్థ వైఫల్యం కుమ్మక్కు వున్నాయని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కేసు వుంటే మంత్రినైనా సరే ఎస్ఐ కూడా విచారించవచ్చని చెబుతున్న మాజీ డిజిపి నయీంను పట్టుకోవాలని తానిచ్చిన ఉత్తర్వును ఎందుకు అమలు చేయాలేదు? తనపై కథనం ప్రసారం చేసిన ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చయవచ్చు గాని బాధ్యతా యుత స్పందనగా అనిపించలేదు.
ఇక దినేష్ రెడ్డి వ్యాఖ్యల విషయంలో బిజెపి వైఖరి తెలుసుకుందామని అధికార ప్రతినిధితో మాట్లాడాను. అసలు విమర్శలకు గురవుతున్న వారితోనే ఎందుకు మాట్లాడించాల్సి వచ్చిందని అడిగితే అది దినేష్రెడ్డి అత్యుత్సాహం తప్ప పార్టీకి సంబంధం లేదని ఆ ప్రతినిధి చెప్పారు. నయీం విషయంలో జరిగినదాన్ని తాము హర్షిస్తున్నామని, పెద్దగా మాట్లాడనవసరం లేదని భావించామని అన్నారు.అమిత్ షా కు సంబంధించిన షాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో నయీం పాత్ర గురించిన ప్రశ్నలను కూడా ఆప్రతినిది తేలిగ్గా కొట్టిపారేస్తూ ఎన్నొ వస్తుంటాయి అన్నీ నిజం కావాలనిలేదు అని వ్యాఖ్యానించారు. మిగిలిన పార్టీలలా బిజెపి నయీం కేసులో స్పందించకపోవడమే గాక మాజీ డిజెపికి అవకాశమిచ్చి ఆ పైన వ్యక్తిగతమని సరిపెట్టడం వింతగా వుంది. విమర్శలను పెంచుతుంది.