మంత్రులే రామంటున్నారే..?
. అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం విషయంలో ఇప్పటికి పదిసార్లకు పైగా వాయిదా పడిన తరలింపు ప్రహసనం మొన్న బుధవారం మరోసారి పక్కకు పోయింది. ఉద్యోగులు తరలిరాకపోతే వూరుకోమని హెచ్చరికలు చేశారు గాని ఇప్పుడు సాక్షత్యూ మంత్రులే రాలేమని మొండికేస్తే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అరకొర కార్యాలయాల్లోకి వెళ్లడానికి కనీసం పది పదిహేనుమంది మంత్రులు నిరాకరించడంతో ప్రభుత్వం గప్చిప్గా సర్దుకుంటున్నది. తమ ఛేంబర్లకు .స్థలం చాలక పోవడం సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలు మంత్రులకు చిర్రెత్తించడం సహజమే. అసలే మొదటి నుంచి రాజధాని వ్యవహారం తమకు సంబంధం లేకుండా నారాయణ ఒక్కరితోనే నడుస్తున్నదని వారిలో చాలామంది గుర్రుగా వున్నారు. అప్పుడప్పుడూ తమ ఆగ్రహాన్ని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు కూడా. చివరకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులూ, సిఎంకు దగ్గరైన మరో ఆరుగురు మంత్రులూ ఆఖరుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా కార్యాలయాలు తరలించుకుండానే ఏదో లాంచనంగా సరిపెట్టారు.గతంలో తరలించిన మూడు శాఖల వారు కూడా వినాయకచవితి వరకూ వాయిదా వేసుకున్నారు. హైదరాబాదు నుంచి వచ్చేసి మళ్లీ వెనక్కు మరలిన ఉద్యోగులు వచ్చి చూసి పెదవి విరిచేశారు. ప్రభుత్వ దృష్టి మొత్తం కృష్ణా పుష్కరాల హడావుడిలోవుండటంతో రాజధానిపై అసలే శ్రద్ద తగ్గింది. కార్పొరేట్ కార్యాలయాను మించిపోయేలా నిర్మించారని కొన్ని ఛానళ్లు పత్రికలు వూదరగొడుతుంటే మంత్రులకే మనసుకు రాని ఈ దురవస్థను ఎలా అర్థం చేసుకోవాలి? నిర్మాణం చేస్తున్న షాపూర్జి పల్లోంజి కంపెనీ మంత్రులను శాంతపర్చి మార్పులు చేర్పులు చేస్తానని నచ్చజెప్పాల్సి వచ్చింది. అది బాగానే వుంది గాని ఉన్నత స్థాయి అధికార నిర్మాణాలలో ఇంత అస్పష్టత ఎందుకు దాపురించింది? ఇక పన్నెండవ ప్రవేశ ముహూర్తం ఎప్పుడు పెదతారో కృష్ణమ్మకే తెలియాలి.
