రాజ్యాంగ సవరణతోనే ‘అగ్రకుల’ రిేజర్వేషన్
పాటిదార్ల ఆందోళన నేపథ్యంలో ఆర్థికంగా వెనకబడిన వారి పేరిట గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన పదిశాతం రిజర్వేషన్ చెల్లబోదని హైకోర్టు కొట్టి వేయడం చాలా తీవ్ర ప్రభావం చూపించే విషయం. ముఖ్యమంత్రి ఆనందిబెన్ ప్రభుత్వం 2015 మేలో ఈ జీవో జారీ చేసింది. రాజ్యాంగం కేవలం ఎష్సిఎస్టిలకు సామాజికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వచ్చని చెబుతున్నది తప్ప ఆర్థిక వెనకబాటు గురించి మాట్లాడటం లేదని గుజరాత్ హై కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఈ తీర్పు ఆ రాష్ట్రానికే గాక దేశమంతటిపైనా ప్రభావం చూపించే దృష్టాంతమవుతుంది. న్యాయమూర్తులు రోహిణి,జయంత్నాథ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునివ్వడం దిగిపోతున్న ముఖ్యమంత్రి ఆనందిబెన్కే గాక మొత్తం బిజెపి కే రాజకీయంగా ఎదురుదెబ్బ. ఎందుకంటే వారు పాలించే రాజస్థాణ్లో గుజ్జర్లు, హర్యానాలో జాట్లు తదితర తరగతుల రిజర్వేషన్ ఆందోళనను ఎదుర్కొంటున్నారు. జాట్లకు రిజర్వేషన్ల కల్పన కూడా నిలవకుండా పోయింది.గుజ్జార్లను ఎస్టిలో చేర్చడానికి అక్కడ స్థానిక ఎస్టిలు సిద్ధంగా లేరు.మొత్తంపైన రాజకీయ అవసరాల కోసం ఇష్టానుసారం రిజర్వేషన్ జాబితాను పెంచుకుంటూ పోవడానికి అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాక రిజర్వేషన్ కోటా మొత్తం యాభై శాతం దాటరాదన్న నిబంధనను కూడా ప్రభుత్వం పాటించలేదని జయంతి భారు అనే సామాజిక కార్యకర్త కేసు దాఖలు చేశారు. అగ్రకులాల్లోనూ ఆర్థిక వెనకబాటు వుంటుందనే వాదనకు ఎలాటి ఆధారాన్ని ప్రభుత్వం సమర్పించలేదని ఆయన వాదించారు. ఏదాదికి ఆరులక్షల వరకే ఆదాయంవున్న వారిని ఆర్థిక వెనుకబాటు కోటాలో గుజరాత్ ప్రభుత్వంచేర్చింది. అయితే 2015లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ అప్లయిడ్ రిసెర్చి సంస్థ ఒక అమెరికా విశ్వవిద్యాలయంతో కలసి నిర్వహించిన సర్వే ప్రకారం దేశ జనాభాలో 2.5శాతం మందికి మాత్రమే ఈ మేరకు అదాయం వస్తుంది. అంటే ఈ నిబంధనల ప్రకారం జనాభాలో మిగిలిన 97.5శాతం మంది ఈ తరహా రిజర్వేషన్కు అర్హులవుతారు. అదే జరిగితే ఇక రిజర్వేషన్ల మాటకే అర్థం లేకుండా పోతుందని విమర్శకులు అంటున్నారు. ఒక వేళ నిజంగా ఆర్థికంగా వెనకబడిన వారికి కూడా కులంతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాల్సిదేనని కోర్టు తీర్పు సూచిస్తున్నది.
