చిరు,పవన్‌,బాబులను మించిన బాలయ్య!

balakrishna-legend
నందమూరి బాలకృష్ణ ప్రత్యేకహౌదాపై నోరు విప్పి చేసిన వ్యాఖ్యలు మౌన వ్రతం పాటిస్తున్న చాలామంది నేతలకూ ప్రముఖుల కన్నా మెరుగనిపిస్తున్నాయి.ఈ నేతల జాబితాలో మెగాస్టార్‌(కాంగ్రెస్‌ ఎంపి) చిరంజీవి, పవర్‌స్టార్‌(జనసేన అధినేత) పవన్‌ కళ్యాణ్‌లతో పాటు బావ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వుంటారు మరి. ప్రత్యేక హౌదా కోసం ఎవరినీ బతిమాలాల్సిన అవసరం లేదని ఆయన అన్న మాటలు బావ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే ముందుగా తగలుతాయనుకోవాలి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రక్తం మరుగుతుందని అంటూనే చంద్రబాబు చివరకు వచ్చేసరికి వినతులతో చర్చలతో సరిపెడుతున్నారు. రాజ్యసభలో అంత గట్టిగా ్‌జెట్లీ తిరస్కారం వినిపించిన రెండు రోజుల్లో ఏదో పరిశీలిస్తామనే పల్లవి ఆలపించగానే తెలుగుదేశం నేతలు పరవశించవలసిన అవసరం లేదు. అంత సన్నివేశం కూడా లేదు. జైట్టీగాని మరో నాయకుడు ఇంతవరకూ ప్రత్యేక హౌదా అన్న మాట ఉచ్చరించి ఇస్తామని చెప్పిందే లేదు. ఎపితో వుంటాం, అభివృద్ధికి సహకరిస్తాం ఇలాటి మాటలు చాలా కాలంగా చాలాసార్లు వింటూనే వున్నాం. గుడుగుడుగుంచాలు అడినట్టు వారే కూచుని చర్చించి ఖండించి మళ్లీ చర్చించుతామంటే విశ్వసనీయత ఏమిటి? ఈ పరిస్థితుల్లో హౌదా ఇవ్వకపోతే బిజెపి రాజకీయ మూల్యం చెల్లించవలసి వుంటుందని బాలయ్య చెప్పడం బాగుంది. తెలుగువారి పౌరుషం వగైరాల గురించిన ఆయన మాటలు కూడా డైలాగుల్లా ధ్వనించినా అదేపనిగా ప్రాధేయ స్వరం వినిపిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పే కావాలి మరి.అదే విధంగా పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక హౌదా రాదని తెలిసిన రోజున తప్పక నిలదీస్తానని ప్రకటించారు. ఇంతవరకూ కిమ్మిన్నాస్తి! ఇక చిరంజీవి సరేసరి. మాజీ కేంద్రమంత్రిగా ఎంపిగా ఈ సమయంలో ముందుండి అడగాల్సింది పోయి మొక్కుబడిగా కనిపిస్తున్నారు.కెవిపి బిల్లుపై ఓటింగు వస్తుందన్న రోజు పార్లమెంటు బయిట మాట్లాడారు. తర్వాత ఎంత దుమారం రేగుతున్నా ఉద్యమాలు సాగుతున్నా నోరు విప్పడం లేదు. అసలు కనిపించడం లేదు కూడా. సినిమా షఉటింగులో వున్నా ఆడియో విడియో ఫంక్షన్లకు వస్తూనే వున్నారా ఆ పాటి విలువ లేనిదా ప్రత్యేక హౌదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *