కార్డులపై వేటు, పేదల బియ్యానికి చేటు

vcootQCOEOCPCCIPEVTTT
అధికారంలో ఎవరున్నా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు పేదల పాలిట పెనుశాపాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా మండేధరలతో కనీస జీవితావసరాలు కొనుక్కోవడమే గగనమై పోతుంటే చౌకధరల సరఫరాలు వెనక్కు పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్‌ ప్రభుత్వం ఉధృతంగా రేషన్‌ కార్డుల ఏరివేత చేపట్టడం వల్ల నిరుపేదలకు దక్కాల్సిన బియ్యం మిగిలిపోతున్నాయి. సర్కారుకు మిగులు చూపిస్తుంటే కడుపు రగిలిన పేదలు మాత్రం లబోదిబోమంటున్నారని సాక్ష్యాధారాలతో వెల్లడైంది….. నిరుపేదలు, ఎలాంటి ఆధారమూ లేని వారు, ఒంటరి లబ్ధిదారులు, వికలాంగులకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ప్రభు త్వం తెలంగాణలో 7,91,521 అంత్యోదయ కార్డులను, 16,740 అన్నపూర్ణ కార్డులను కేటాయించింది. అంత్యోదయ కార్డులకు కిలోకు రూ.1 చొప్పున 35 కిలోలు, అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తారు. దారిద్య్రరేఖకు దిగువనున్న వీరందరికీ క్రమం తప్పకుండా కార్డులన్నింటికీ అన్ని సరు కులు అందేవి. అయితే రెండేండ్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు కార్డుల సంఖ్యను దాదాపుగా తగ్గించింది. అంత్యోదయ 2,26,750, అన్నపూర్ణ 11,732, మొత్తం 2,38,482 కార్డులను రద్దు చేసింది. ప్రస్తుతం 2016-17లో అంత్యోదయ కింద 5,64,771, అన్నపూర్ణ 5,008 కార్డులు ఉన్నట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కన కార్డుల రద్దుతో అంత్యోదయ కింద 79,36,250 కిలోలు, అన్నపూర్ణ 1,17,320 కిలోల చొప్పున మొత్తం 80,53,570 కిలోల బియ్యం మిగిలించుకొని పేదల కడుపు మాడ్చింది.రాబోయే రోజుల్లో మరింత మందికి ఈ పరిస్థితి ప్రాప్తించవచ్చని సంకేతాలున్నాయి. ఇప్పటికే చౌక దుకాణాల్లో కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, వంటనూనె వంటివి ఆగిపోయాయి. చింతపండు , సబ్బులు వగైరా ఆయా డీలర్లను బట్టి జరుగుతున్నాయి. త్వరలోనే నగదు బదిలీ ప్రహసనం మొదలైతే పరిస్థితి మరింతగా దిగజారవచ్చు. సిపిఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన ఈ సమాచారంపై ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. సమర్థించుకునే బదులు సత్వరం సరఫరాలు పునరుద్ధరించడం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *