ఆఖరుకు అణుకుంపట్ల హబ్గా ఎపి
ఐటిహబ్, ఫార్మా హబ్ ఇలా హబ్లు కారిడార్ల భాషలో మాట్లాడ్డం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా ఇష్టం. వాటివల్ల సౌభాగ్యం కురుస్తుందనీ, ఉద్యోగాలువెల్లువలా వచ్చిపడతాయని ప్రభుత్వం చెబుతుతుంటుంది. ఇందులో అత్యధికభాగం ఇంకా వాస్తవం కాలేదు గాని అమరావతిలో సింగపూర్ కంపెనీలకు ప్రజల భూమిని ప్రభుత్వ ధనాన్ని పరోక్షంగా ధారాదత్తం చేయడందాదాపు పూర్తయింది. అక్కడ భూమి మాత్రమే పోయింది గాని అంతకంటే అనర్థదాయకమైన ఆందోళన కరమైన ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అదే అణు విద్యుత్ సంస్థలను విచ్చలవిడిగా నెలకొల్పడం. ఆ విధంగా చూస్తే ఎపిని అణుహబ్గా మార్యేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో సంతకాలు చేసిన ఒప్పందాల మేరకు అణువిద్యుత్ సంస్థలను స్థాపించేందుకు తలుపులు బార్లా తెరిచేశారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్లో మితి వర్ధిలో నెలకొల్పదలచిన వెస్టింగ్టన్ హౌస్ అణు విద్యుత్ ప్రాజెక్టు(ఎన్పిపి)ను ఉత్తరాంధ్రలోని కొవ్వాడకు తరలించడం మొదలైంది. అక్కడే గాక తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇలా ఎక్కడికక్కడ ప్రజల ప్రభుత్వాల వ్యతిరేకత కారణంగా చుక్కెదురైన అణు కర్మాగారాలన్నిటినీ ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎర్రతివాచీ పరిచింది. రష్యా నుంచి అమెరికా వరకూ కొన్ని అగ్రదేశాల నుంచి వచ్చే అణు విద్యుత్ పరికరాల వల్ల మొత్తం 6
3 వేల మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుందంటే ఇందులో సగం అంటే 30 వేల మెగావాట్ల వరకూ ఎపిలోనే రాబోతున్నాయి. రష్యా ప్రధాని మెద్వెదేవ్కు ఈ మేరకు ఇటీవలి పర్యటనలో చంద్రబాబు ఆహ్వానం పలికి వచ్చారు. దీన్ని నెల్లూరు జిల్లా కావలిలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం ఆరుచోట్ల ఈ అణు సంస్థలు వస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నిజంగా ఇతర చోట్ల వద్దని తరిమికొట్టినవి ఇక్కడ తెచ్చి పెట్టుకోవడం కొరివితో తలగొక్కోవడమే. ఎందుకంటే గతంలో చెర్నొబిల్ ఇటీవల పుకషిమా అణు కేంద్రాల ప్రమాదాల తర్వాత ప్రపంచం ఈ విషయమై చాలా ఆందోళన చెందుతున్నది. అందుకే తోషిబా వెస్టింగ్టన్ హౌస్ లకు గుజరాత్లో ప్రతికూలత ఎదురైంది. అయితే వాటిని కోరి కొవ్వాడలో పెట్టేందుకు అనుమతి లభించింది. 1100 మెగావాట్ల సామర్థ్యం గల ఆరు రియాక్టర్లను స్తాపించడానికి 700 ఎకరాల పైగా భూమి సేకరించినా రానున్న ఎన్నికల రీత్యా మోడీ నాయకత్వం వెనకంజ వేసింది. ఇదేగాక ఇప్పటికే అక్కడ ఈ వ్యాపారంలో వున్న అదానీ టాటా ఎస్సాఆర్ వంటి కంపెనీలు కూడా ఇందుకు వ్యతిరేకత ప్రకటించాయి. గుజరాత్లో ప్రైవేటు విద్యుత్ వినియోగం అత్యధికం అనేది తెలిసిందే. వీటిని తరలించడానికి ముందే జిఇహిటాచీ కంపెనీకి కూడా కొవ్వాడలోనే అనుమతిలభించింది. ఇక రష్యన్లు సరఫరా చేసే వెవెర్ రియాక్టర్లు ఆరు బెంగాల్లోని హరిపూర్లో నెలకొల్పాలన్న ఆలోచన అమలు కాక ఎపికి మరల్చారు. వీటికోసం స్థలాలు చూడవలసిందిగా తాము ప్రకాశం నెల్లూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్టు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చెబుతున్నారు. ఇతరులు వదలుకున్నవి మనకు లాభం అని ప్రభుత్వం చెబుతున్న మాట వినేందుకు స్తానిక ప్రజలు సిద్ధంగా లేరు. కొవ్వాడలో ఇప్పటికే తీవ్ర నిరసన ఉద్యమం నడుస్తున్నది. ఈ మధ్యనే సిపిఎం నాయకుడు ప్రకాశ్ కరత్ కూడా పర్యటించి వెళ్లారు. పర్వావరణ నిపుణుడు ఇఎ శర్మ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే అమరావతిలో వలెనే ఇక్కడా పోరాటాలను అణచివేసి అణుకుంపట్టు తెచ్చిపెట్టుకోవాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరు తున్నది. తదనంతర పర్యవసానాలు మాత్రం స్థానిక ప్రజలే భరించాల్సి వుంటుంది. పైగా పరిహారం బాధ్యత మాది కాదని అమెరికా కంపెనీలు ముందస్తు షరతు పెట్టి ఆమోదింపచేసుకున్నాయి.
