ఓం సిటీ కోసం 3000 ఎకరాల అటవీ భూమి

త్రిదండి చిన జీయర్ స్వామి, ప్రముఖ వ్యాపార వేత్త రామేశ్వరరావుల బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకోవడం మీడియాలో బాగా ప్రచారమైంది. దేశ రాజధానిలో తెలంగాణ ముఖమంత్రి కెసిఆర్ మకాం చేసి వున్నప్పుడే ఇది జరగడం కూడా ఆసక్తికరమైంది. ఈ ముగ్గురి అనుబంధం తెలుగు వారికి మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాస్తవ్యులకు , మీడియా ,రాజకీయ వర్గాలకు బాగా తెలుసు. రామేశ్వరరావు స్వంత వేడుకల్లోనే కెసిఆర్ జియ్యర్ ఇద్దరూ ఎంతో ప్రాధాన్యత నిచ్చి పాల్గొన్నారు. వారి కార్యక్రమం లేదా వాణిజ్య ఉత్సవం అనగానే అంతటి స్వాముల వారు రెక్కలు కట్టుకుని వాలడం, అనితర సాధ్యుడైన కెసిఆ
ర్ కావలసినంత సమయం కేటాయించడం పరిపాటి. శంషాబాద్లో భారీ రామానుజ విగ్రహ స్థాపన గురించి జియ్యర్ స్వామి చేస్తున్న ప్రయత్నం ఈనాడులో చాలా భారీ కథనంగా ఆయన ఇంటర్వ్యూతో సహా వచ్చింది. ఈ విగ్రహ స్థాపన రామేశ్వరరావు స్వంత స్థలంలో జరుగుతుంది గనక పెద్ద పేచీ వుండదు. కాని రామోజీరావే తలపెట్టిన ఓం సిటీ సంగతి వేరు. ఫిలింసిటీతో పోటీ పడేలా ఓం సిటీ కట్టి ఆధ్మాత్మిక ముద్ర వేసుకుంటానని ఆయన ప్రకటించడం ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలోనే ఒకటికి రెండు సార్లు జరిగింది. కెసిఆర్ చేసిన చండీయాగానికి కూడా రామోజీ చాలా ప్రత్యేకంగా హాజరైనారు. ఎన్నడూ లేని విధంగా సచివాలయానికి స్వయంగా వెళ్లి కెసిఆర్కు తన ఓం సిటీ ఆల్బం ఇచ్చి వచ్చారు. అంతకు ముందు ముఖ్యమంత్రి స్వయంగా ఫిలింసిటీలో గడిపి పొగిడి వచ్చారు. రామోజీ రామేశ్వరరావు ఎవరైనా సరే వ్యక్తిగత సాన్నిహిత్యాలు భక్తి విశ్వాసాలు వారి ఇష్టమే. కాని వీటికి ఫ్రభుత్వాధినేతల ప్రమేయం, సహాయం అవసరమైనప్పుడే సమస్య మొదలవుతుంది. ఫిలిం సిటీ భూములపైనే చిన్నచిన్న వివాదాలు వున్నా సులభంగా పరిష్కరిస్తామని కెసిఆర్ సిటీలోనే ప్రకటించి వచ్చారు. అయితే ఇప్పుడు ఓం సిటీకోసం మరో మూడు వేల ఎకరాలు కావాలని రామోజీ కోరుతున్నారు. ఇందుకు అటవీ భూమిని కేటాయించేందుకు కెసిఆర్ సర్కారు సిద్ధమై పోయింది కూడా. అయితే కేంద్రమే ఒకింత తటపటాయిస్తున్నట్టు సమాచారం. ఏమంటే అటవీభూమిని ప్రజావసరాల నిమిత్తం తప్ప ఇతర పనుల కోసం కేటాయించడం తరలించడం చట్టం ఒప్పుకోదు. ఓం సిటీ భక్తి మాట ఎలా వున్నా ప్రైవేటు టూరిజం ప్రాజెక్టు. అది పూర్తిగా రామోజీ గ్రూపు యాజమాన్యంలో నడుస్తుంది. అలాటప్పుడు దానికి మూడు వేల ఎకరాల అటవీభూమిని ఇస్తే విమర్శలు తప్పవు. రామ్దేవ్ బాబా , రవిశంకర్ గురూజీల ఉదంతం చూశాక వ్యాపారం రాజకీయం మతం ఎలా పెనవేసుకుపోయాయో దేశానికి అర్థమైంది.ఇక ఇప్పుడు ఓం సిటీ దాని మరో రూపం కాబోతుందా? గతంలో చెప్పుకున్నట్టు తెలుగునాట నలుగురు ఘనాపాటీలైన ఇద్దరు చంద్రులు ఒక వెంకయ్య నాయుడు, ఒక రామోజీ రావు తలపెట్టిన ఈ ఓం వ్యవహారం కాస్తముందో వెనకో ఒకె అవుతుందని టిడిపి ప్రముఖుల సమాచారం. బహుశా దాని వెంల నిరసనలు కూడా తప్పక పోవచ్చు. అయితేనేం వడ్డించే వారు అంటే నడిపించే వారు మనవారైనప్పుడు!!