ఇంతమందికి జీతాల్లేవట సార్!
రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సంబంధిత సంఘాలు ఆవేదన చెందుతున్నాయి.
– మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్, ఎ.ఎన్.ఎమ్స్ (సెకండ్ ఎ.ఎన్.ఎమ్స్, యూరోపియన్ ఎ.ఎన్.ఎమ్స్కు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. వైద్య విధాన పరిషత్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు.
– స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అంగన్వాడీలకు పెంచిన జీతాలు ఏప్రిల్ నుండి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. 3నెలలు దాటుతున్నా ఇప్పటివరకు అమలులోకి రాలేదు. పెంచిన జీతాల అమలు ఇలా ఉంటే వీరికి ఇప్పటికే 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
– రెవెన్యూ శాఖలోని గ్రామ సేవకులకు గత 5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు.
– అనేక మున్సిపాలిటీల్లో అవుట్ సోర్సింగ్ వారికి 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
– సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని వార్డెన్లు మరియు కుక్లకు గత 3నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
– కాంట్రాక్టు లెక్చరర్లకు 3 నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇతర కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.
– రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 3లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి వేతనాలు పెంచలేదు. తక్షణం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సిని అమలు చేయాలి.
ఈ విధంగా నాలుగైదు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వలన వారి కుటుంబ ఆర్థిక అవసరాలు తీరక అనేక అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనుకున్నా వారికి కూడా అవసరాలు ఉంటాయి. చాలా మంది పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులు చేస్తున్న ఈ విజ్ఞప్తిని వింటారా, ముఖ్యమంత్రి గారూ..?
