అంతా అయ్యాక ఆగ్రహ చంద్రన్న!

జరగాల్సింది జరగనిచ్చి ఆ పైన ఆగ్రహించడం లౌక్యుల లక్షణం. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకు తెలియకుండానే పథకాలకు తన పేరు పెడుతున్నారని ఆయన అధికారులపైన నాయకులపైన ఆగ్రహించారట. అంటే పథకాలకు చంద్రన్న నామకరణం చేసినవారు ఆయనకు తెలియకుండానే చేశారా? వీటిలో కొన్ని తనే ప్రారంభించారు కూడా కదా! ఈ పథకాలు అలా అలా పెరిగిపోతున్నాయని మీడియాలో వ్యాఖ్యలు వచ్చినా పట్టించుకోలేదే? ఆరోగ్యపథకమైతే రామన్న ఆరోగ్యం అంటూ ఎన్టీఆర్ను గుర్తు చేయాలనుకుంటే చివరి నిముషంలో చంద్రన్న సంచార వైద్యశాలగా మార్చి ముఖ్యమంత్రి చేతుల మీదుగానే ప్రారంభించారు. అప్పుడే టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద కథనం ఇచ్చింది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా తన పేరుమీద తనే ఇన్ని పథకాలు ప్రారంభించుకోలేదు అని. జయలలిత కూడా అమ్మ పథకాలు అనే వుంటుంది కాని ఆమె పేరు వుండదు. ఆ ప్రకారం
అన్న అందామంటే అది ఎన్టీఆర్ను గుర్తు చేస్తుంది గాని చంద్రబాబును కాదు. రామన్న పేరు తీసేసినా ప్రయోజనం వుండదు. కనుకనే కాస్త నిస్సంకోచంగానే చంద్రన్న జపం కొనసాగనిచ్చారు. చంద్రన్న సంక్రాంతి కానుకతో మొదలైంది. చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రుణమేలా, ఉద్యోగమేళా,వ్యవసాయ క్షేత్రం,దళితబాట, చేయూత ఇలా పరంపరగా సాగించారు.ఎన్టీఆర్ భరోసా, ఆరోగ్యసేవ మాత్రమే మిగిలాయి.
ఈ ధోరణి శ్రుతిమించి కాపుల కోసం నిర్మించే భవనాలకు కూడా చంద్రన్నపేరే పెట్టాలని అనాలోచితంగా అత్యాశగా నిర్ణయం తీసుకుంటే బెడిసికొట్టింది.దీనిపై ఆ కుల నాయకుల నుంచి విమర్శ వచ్చాకైనా మార్చుకోకపోగా తప్పేమిటని ఎదురు దాడి చేశారు మంత్రి నారాయణ. అయితే తర్వాత తప్పు అర్థమైన చంద్రబాబు ఆగ్రహం ప్రదర్శించారు. ఎవరిని అడిగి పెడుతున్నారని మందలించారట. అంతేగాక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇకపై ఆయన అనుమతి లేకుండా పథకాలను పేరు పెట్టొద్నది ఒక ఉత్తర్వు వెలువడింది. అంటే అనుమతి తీసుకోవడానికి అవకాశం అట్టిపెట్టారన్న మాట. అన్నట్టు ఈ చంద్రన్న జపంలో మంత్రి రావెల కిశోర్బాబు చాలా ముందున్నారట. ఎవరైనా అధినేత ఆశీర్వాదాలు లేకుండా అంత వూపుగా వెళ్లలేరు కదా! ఇకపై ఏం జరుగుతుందో చూడాలి.