సిబిఐ బాటలో ఎన్ఐఎ!

సిబిఐ సంగతి తెలుసు కదా! కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నారనే దాన్ని బట్టి పనిచేస్తుంటుంది. కేసుల దర్యాప్తు వేగం జాప్యం వుంటాయి. టెర్రరిస్టు నేరాలను ప్రత్యేకంగా శోధించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్ఐఎ) కు కూడా అదే గతి పడుతున్నట్టు కనిపిస్తుంది. బిజెపి అధికారంలోకి వచ్చాక అదివరకు టెర్రరిస్టు చర్యలకు సంబంధించి అరెస్టయిన సంఘ పరివార్అనుకూలులు నెమ్మదిగా విడుదలై పోతున్నారు. 2007లో మహారాష్ట్రలోని మాలెగావ్ పేలుళ్ల కేసులో మొదట యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ ఎనిమిది మంది ముస్లిములను అరెస్టు చేసింది.అయితే తర్వాత తెలిసిన విషయాలను బట్టి అభినవ భారత్ అనే అనుబంధసంస్థకు చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ తదితరులకు దీనితో సంబంధం వుందని 2008లో అరెస్టు చేశారు. 2011లో దీన్ని ఎన్ఐఎకు అప్పగించారు. ఆ సంస్థ డైరెక్టర్ శరద్ కుమార్ 2013లో యుపిఎ హయాంలో నియమితుడు కాగా మోడీ ప్రభుత్వం పొడగింపు ఇచ్చింది. అప్పటినుంచి ఈ కేసుల దర్యాప్తు నత్తనడక నడిచింది. ఈ మధ్యనే సుప్రీం కోర్టులో ఎప్ఐఆర్ దాఖలు చేయడానికి నెల రోజుల సమయం కోరింది. ఈ లోగా ప్రసాద్ పురోహిత్ బయిటపడేందుకు ఉపయోగపడే పత్రాలు సైన్యమే అందించింది.మరోవైపున చాలా ఏళ్లు గడిచినందున సాక్షుల జ్ఞాపకం దెబ్బతిన్నదని శరద్ కుమార్ చెబుతున్నారు.కొంతమంది అడ్డం తిరగడంపైన కూడాతాము చేయగలిగింది లేదంటున్నారు. అప్పట్లో యుపిఎ ప్రభుత్వం వత్తిడిపై తాము అలా చెప్పామని వారు అంటున్నారని ఆయన తెలిపారు. అయితే నిజానికి మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ కేసుల్లో మెల్లగా వెళ్లాలని తమపై ఒత్తిడి పెరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వున్న రోహిణీ సాలైన్ స్పష్టంగా చెప్పారు.సుహాస్ వర్కె అనే ఎస్పి సూటిగానే తనకు ఆ సంగతి చెప్పారని ఆమె తెలిపారు. కాని వీటినెవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్ఐఎ దేశంలో సాక్ష్యాలు సేకరించడం వదలిపెట్టి అమెరికాలో ఎల్టిఇకి చెందిన నిందితుడు వున్నాడంటూ అక్కడకు వెళ్లింది.ఇదంతా కేసును పక్కదోవపట్టించే ప్రయత్నమేనని హిందూ వ్యాఖ్యానించింది. అంతేగాక మీరు కూడా సిబిఐలాగే చేస్తున్నారా అని ఎన్ఐఎ అధినేత శరద్ కుమార్ను అడిగితే అరకొరగా సమాధానమిచ్చారు.
మరోవైపున మాలెగావ్ పేలుళ్ల కేసులో అప్పుడు అరెస్టు చేసిన ఎనిమిది మంది ముస్లింలను కోర్టు విడుదల చేసింది.