బంగ్లాదేశ్లో ఆరవ హేతువాది హత్య

బంగ్లాదేశ్ లోని రాజాషాహి యూనివర్సిటీలో ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రేజ్వాల్ కరీమ్ సిద్ధిక్ను దుండగులు శనివారం దారుణంగా హత్యచేశారు. ఆయన హేతువాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈ హత్య చేశామని ఐఎస్ గ్రూపునకు అనుబంధంగా వుండే ఉగ్రవాద సంస్థ అమార్క్ ప్రకటించింది. అమెరికాలో ఈ తరహా వెబ్సైట్లను పరిశీలించే సైట్ ఏజన్సీ ఈ వివరాలు విడుదల చేసింది. ప్రొ.సిద్దిక్ ఇంట్లోనుంచి వస్తుండగా స్కూటర్పై వచ్చిన దుండగులు గొంతుకోసి జరిపి పారిపోయారు. ఇప్పటికే అయిదుగురు హేతువాద రచయితలు బ్లాగర్లను ఇస్లామిక్ మతోన్మాదులు హత్యచేశారు. ఇది కూడా ఆ హత్యల తరహాలోనే జరిగిందని పోలీసు అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్లో ఐఎస్కు చోటు లేదని ప్రభుత్వం చెబుతున్నావారితో నెట్వర్కింగ్ చేసుకునే ఉగ్రవాద ముఠాల వునికిని మాత్రం అంగీకరిస్తున్నది. ఈ గ్రూపులే గతంలో హేతువాదులపైన క్రైస్తవ ఫాదరీలపైన కొన్ని మసీదులపైన జరిగిన దాడికి బాధ్యత తమదని ప్రకటించాయి.
వాస్తవానికి ప్రొఫెసర్ సిద్దిక్ సాంసృతిక కార్యకలాపాల్లో పాల్గొడనం తప్ప నాస్తిక హేతువాద రచనలు చేసిన వ్యక్తి కాదని ఆయన సహచరులు చెబుతున్నారు. ఈ హత్యలపై విద్యార్థులు అధ్యాపకులుతీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలోనే ఇప్పటికి మూడు హత్యలు జరిగాయి. అసలు ఈ ప్రాంతమే హత్యలు దాడులతో అట్టుడికిపోతున్నది.