మరో సైనిక తిరుగుబాటు దిశగా పాక్?
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ రహీల్ షరీఫ్ 11 మంది ఉన్నతాధికారులను ఒక్కదెబ్బతో తొలగించడం కలకలం రేపింది. వారిలో లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, జనరల్, బ్రిగేడియర్లు, కమాండర్లు వున్నారు. అవినీతి ఆరోపణలపై వారిని తొలగించినట్టు అధికారికంగా చెబుతున్నారు. సైనికాధికారులలో అవినీతిని నిర్మూలించకపోతే సరిహద్దులకు ఆవల టెర్రరిజాన్ని ఎదుర్కొవడం ఎప్పటికీ సాధ్యం కాదని ఈ మధ్యనే షరీఫ్ హెచ్చరిక చేశారు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం పనామా పత్రాలలో ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు ప్రముఖంగా వచ్చింది. అంతకుముందే ఆయనపై రకరకాల ఆరోపణలున్నాయి. పనామా పత్రాల తర్వాత నవాజ్ షరీప్ రాజీనామా చేయాలనే డిమాండు వూపందుకుంటున్నది. గతంలోనూ ఇదే విధమైన నేపథ్యంలో సైన్యం ఆయనను తొలగించింది. తర్వాత ముషారప్ అధికార పగ్గాలు చేపట్టారు. పాకిస్తాన్ చరిత్రలో సగం సైనిక ని
యంతృత్వంలోనే మగ్గిపోయింది. భారత వ్యతిరేక కుట్రలలో సైనికాధికారుల పాత్ర చాలా ఎక్కువగా వుంటుంది.బెనజీర్ భుట్టో నవాజ్ షరీప్ వంటివారు ప్రధానులుగా వున్నా సైన్యం మాటే చెల్లుతుందని అందరికీ తెలుసు. సైన్యం అవినీతి అధికారులు ఇస్లామిక్ మత శక్తుల కూటమి సహాయంతోనే పెట్టుబడిదారులు భూస్వాములు పాలన చేస్తుంటారు. ఈ నియంతలకు అమెరికా సహాయ సహకారాలుంటాయి. మరి మరోసారి అలాటి పరిస్థితి పునరావృతం కాబోతున్నదా? సైనికాధికారుల తొలగింపు వార్త పాకిస్తాన్ అధికారిక మీడియా ప్రసారం చేయలేదు. సైన్యంపై తన పట్టుపెంచుకోవడానికే రావుల్ షరీఫ్ వీరిని తొలగించారా? ఈ సందేహాలకు రానున్న రోజుల్లో సమాధానాలు లభించాలి.
