తలవొగ్గని రఘురాం రాజన్

ో రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ భారత దేశం మహత్తర ఆర్థికాభివృద్ది సాధించిందనే కట్టుకథలు పటాపంచలు చేస్తూ మనం అంధుల రాజ్యంలో ఒంటికన్ను రాజులా మన పరిస్థితి వుందని వ్యాఖ్యానించారు. . చెట్లు లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షమన్నట్టు మనం చెప్పుకుంటున్నామని ఆర్బిఐ గవర్నరే అంటున్నారంటే మోడీ సర్కారు అతిశయోక్తులకు అంతకన్నా శృంగభంగం ఏముంటుంది? ఇది సహించలేక ఆయన వాడిన మాటలు బాగాలేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దాడి చేయడం కూడా రాజకీయ అసహనాన్నే ప్రతిబింబించింది. ఆ తర్వాత కూడా ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే బలహీనంగా తయారైంది గనక మన అభివృద్ధి పెద్దగా కనిపిస్తున్నదని, ఇంతకంటే మెరుగైన పరిస్థితికి చేరుకోవాలని తాను కోరుకుంటానని ఆయన స్పష్టీకరించడం ద్వారా ఆయన సదరు కేంద్ర మంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చారన్నమాట. రాజకీయ విమర్శలతో ఉక్కిరి బిక్కిరి అటుంచి ఆర్థిక రంగంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వైపుల నుంచి విమర్శల పాలవుతున్నది. బాహాటంగా కార్పొరేట్ అనుకూలత ప్రదర్శించడం, కార్మిక భద్రతపైన దాడి చేయడం బిఎంఎస్ వంటి బిజెపి కార్మిక సంస్థ కూడా సమర్థించలేని స్థితికి చేరింది. ఇటీవలి ఉమ్మడి సమ్మెలో పాల్గొనేందుకు అంగీకరించి ఆఖరి నిముషంలో ఒత్తిడి వల్ల వెనక్కు తగ్గింది. కార్మికులు ఉద్యోగులు శ్రమించి దాచుకున్న పిఎఫ్ ఉపసంహరణకు కూడా షరతులు పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. చివరకు ఇప్పుడు కర్ణాటకలో ఉధృతంగా రగిలిన సమ్మె తర్వాత వెనక్కు తగ్గక తప్పలేదు! కరువుపై నిర్లక్ష్యాన్ని న్యాయస్థానం కడిగిపారేస్తున్నది. గొప్పగా చెప్పుకున్న స్వచ్చ భారత్ కంటితుడుపు తతంగకాగా మేకిన్ ఇండియా ఉత్పత్తి ఉపాధులకు ఏమాత్రం దోహదం చేయడం లేదని అధ్యయనాలు వెలువడ్డాయి. లలిత్ మోడీ నుంచి విజరు మాల్యా వరకూ అక్రమ కుబేరులకు అండగా నిలవడం అప్రతిష్ట తెచ్చిపెట్టింది