చలం కలంలో కమ్యూనిజం
సోషలిజం గురించిన చలం ఆలోచనలను ఒక చోట చూడటం ఎంతో సంతోషకరమైన అనుభవం. స్వేచ్చా భావుకుడైన చలం సమతా ధర్మమైన కమ్యూనిజాన్ని అభిమానించడం, దాని నుంచి చాలా ఆశించడం సహజమే. చలం చిత్తశుద్ధిని ప్రజా పక్షపాతాన్ని తెలియజేసే గొప్ప ఉదాహరణ ఇది. ‘కమ్యూనిజం సర్వశక్తివంతమైంది: ఎందుకంటే అది సత్యం గనక’ అంటాడు లెనిన్. చలం రచనలు చాలా వాటిలో మనకు కనిపించే పదం ‘సూనృత శక్తి’. అంటే సత్యానికి వున్న శక్తి. సత్యమేవజయతే అని నినాదం లిఖించుకున్న ఈ దేశంలో నిజానికి అసత్య ప్రవచనాలే అధికంగా చలామణి అవుతుంటాయి. కాని సామాజిక బంధనాలను తెంచిపారేసేందుకు సిద్ధమైన ఒక సాహితీ తిరుగుబాటుదారుగా చలం ఆర్థిక రాజకీయ తిరుగుబాటు పతాకగా నిలిచిన సోషలిజం సిద్థాంతాలను మనసారా ఆహ్వానించాడని చెప్పేందుకు ఈ పుస్తకంలోని చాలా ఎంట్రీలే తిరుగులేని దాఖలా.
సోషలిజంపై చలం తరహా ఆసక్తికరమైన ఆలోచనాత్మకమైన ఆకర్షణీయమైన వాక్యాలు ఈ సంపుటిలో వున్నాయి. వివేచనాత్మకమైన సందిగ్ధాలు సందేహాలూ కూడా వున్నాయి. సోషలిజాన్ని ఆహ్వానించడంతో పాటు ఆక్షేపించే భాగాలూ వున్నాయి. అయినా సరే- మొత్తంపైన చలం ఎటు వున్నాడంటే సామ్యవాద భావాలలో గొప్ప విముక్తి తత్వం చూస్తున్నాడు. ‘ ప్రజలందరూ సమానులే.. అన్న భావం చాలా మనుష్యం’ ఈ పదం చూడండి. మనుష్యం అట. మానవత్వం అంటే అందులో కొంత విశేషణం వున్నట్టు. కాని మనుష్యం అనడంలో మనుషులకు వుండాల్సిన స్వాభావిక లక్షణం అని స్పష్టం చేస్తున్నాడు.
ఒక దశలో ఆయన ఆశలన్నీ కమ్యూనిస్టులపైన కమ్యూనిజంపైన వుంచినట్టు కనిపిస్తుంది. ‘ఎట్లా లోక కళ్యాణం చెయ్యాలని ఆలోచిస్తే ఒక్క కమ్యూనిజమే మిగిలివుంది ఆధారంగా’ అంటాడు. ‘ చేస్తే కమ్యూనిస్టులే చేయాలి. కమ్యూనిజం తప్పదు’ అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. ‘ఆధ్యాత్మిక వాదులు మనసుకు ఎలాటి దిగుళ్లు లేకుండా పోవాలంటే ఏదీపట్టించుకోకుండా వుండే తత్వం దానికి అలవర్చాలంటారు. అంటే మనసును మార్చాలంటారు. అదే కమ్యూనిస్టులు ఆ బాధలకు మూలమైన పరిస్థితులను మారిస్తే మనసుకు వాటిని పట్టించుకునే పనే వుండదని చెబుతారు’ ఇది చలంకు వున్న స్పష్టత. ‘యీనాటి పాత బూజుదులిపి ప్రజా క్షేమపు దృష్టితో చూడగలిగిన వారు కమ్యూనిస్టులే’ నని బల్లగుద్దిచెబుతాడు. అలా ‘ప్రజల కోసం పోరాడే ప్రతి చిన్న యోధుడు వాస్తవమైన కామ్రేడే’ నంటాడు. దేశభక్తి సంఘసంస్కరణ అన్నిటిపైనా అవిశ్వాసం ప్రకటించిన చలం కమ్యూనిజంపైన కమ్యూనిస్టులపైన అపారమైన ఆశావిశ్వాసాలు చాటిచెప్పడంలో నాటి చాలా మంది విశ్వవిఖ్యాత మేధావులు రచయితల సరసన వున్నాడనేది గమనించాల్సిన విషయం. (పుస్తక సంకలన కర్త ఆళ్ల గురుప్రసాదరావు ఉపోద్ఘాతంలో ఆ జాబితా వుంది) నిస్సందేహంగా చలం ఆ కోవకు స్థాయికి చెందిన మహా ప్రజ్ఞావంతుడు. కనుకనే కమ్యూనిస్టు దేశాలు ఇంకా మహత్తర విజయాలు సాధించక ముందే దాని సమర్థతను, సామాజిక విమోచన స్వభావాన్ని పట్టుకోగలిగాడు. తనకూ కమ్యూనిస్టులకు వున్న పోలిక ఏమిటో కూడా తనే వెల్లడించాడు:
‘ చలం కథల్లో విలన్ సంఘం. కమ్యూనిస్టుల కథల్లో క్యాపిటలిజం. క్యాపిటలిజాన్ని చలం ద్వేషించినంత తీవ్రంగానూ కమ్యూనిస్టులు అసహ్యించుకుంటారు.’ వారిలా తను అనిగాక తనలా వారు అనడంలో స్వతహాగా తాను పెట్టుబడిదారీ విధాన వ్యతిరేకినని ప్రకటించుకుంటున్నాడన్నమాట.
మరో విశేషం చలం చింతాదీక్షితులు పేర వెలువడిన బాట గీతాల్లో ఒక చోట వున్న చరణాలు
చందమామ రావే జాబిల్లిరావే
రైలెక్కి రావే రష్యా కథలు తేవే
బస్సెక్కి రావే బంగ్లా కథలు తేవే
కారెక్కిరావే కామ్రేడ్ కథలు తేవే
ఆనాడు తెలుగు నేలను వూపేసిన సామ్యవాద ఉద్యమాల వెల్లువ సాహిత్య ప్రభంజనం ఈ చరణాల్లో తొంగి చూస్తుంది. సోషలిజం వచ్చిన తర్వాత అనేక హక్కులూ సదుపాయాలూ వచ్చినట్టు తనతో చెప్పిన వారిని ఉటంకిస్తూ పేర్కొన్నాడు.
అయితే చలం రచయితగా వెలిగిపోతున్నా రగిలిపోతున్నా మౌలికంగా దేన్నీ తేలిగ్గా నమ్మే వ్యక్తి కాదు. ప్రతిదీ ఆచరణలో నిగ్గు తేలాలంటాడు. తర్క బద్దంగా వుండాలనుకుంటాడు. ఇదే అంతిమం అని చెబితే ఒప్పుకోవడం ఆయనకు తెలియని విద్య. అందుకే కమ్యూనిజంపైనా మొదటి నుంచి సందేహాత్మకమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చాడు. దీనికి ఆయన జీవితానుభవమూ, మానవ స్వభావంలో సంక్లిష్టత గురించిన అవగాహన ముఖ్య కారణాలు. సోషలిజంలో వ్యక్తులకు స్వేచ్చవుండదనీ, ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమివ్వరని తరచూ వినిపించే విమర్శలపై స్పందిస్తూ – ‘ఈ సమాజంలోనూ చాలా మందికి తిండి కూడా లేదు.స్వేచ్చ ఎలాగూ లేదు. ఈ విధంగా తిండి ి స్వేచ్చ రెండూ లేకుండా చేసే ఈ సమాజం కంటే తిండి,ఇతర దైనందిన అవసరాలు తీర్చడానికి పూర్తి బాధ్యత వహించే ప్రభుత్వం గల సోషలిజమే మెరుగని’ స్పష్టం చేశాడు. అయితే అంతమాత్రాను అంతిమ విజయం సాధించినట్టు భావించడానికి లేదన్నాడు. దీనికి ఆయన చెప్పిన కారణం చాలా విలువైందని ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
మానవ సమాజంలో అంటే మనుషుల ఆలోచనా ధోరణిలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన పాత ఆలోచనలు అలవాట్లు అంత తేలికగా వదిలవేవి కావని ఆనాడే వూహించాడు. ‘కొన్ని ఏళ్లు పోతే గాని నిజమైన ఫలితాలు తేల్తాయి. ఓ పరిస్థితిలో మనుష్య స్వభావం ఎలా రియాక్టు చేస్తుందో నిలకడమీద గాని మనకు తెలియదు’ అంటూ సోషలిజం ముఖ్యంగా సోవియట్ సోషలిజం ఎంత కాలం మనగలుగుతుందో చూడాలన్నాడు.
కమ్యూనిజం వచ్చి ఏదో గొప్ప మార్పు తెస్తుందనిఅందరూ ఆశిస్తున్నారనీ, ఆయన చాలా చోట్ల రాశాడు. ఈ క్రమంలోనే కమ్యూనిజమూ నాస్తికత్వమూ ఒకటే అయినట్టు వారికి సంబంధించిన విషయాలు చెప్పాడు. సలంకలన కర్త గురుప్రసాదరావు కూడా చలం ఆధ్యాత్మిక మతైక సంబోధనలకు ఇందులో చోటు కల్పించారు. సరే అదెలా వున్నా చలం ఒక దశవరకూ చాలా వాస్తవిక దృష్టితో ప్రజల కోణంలో సోషలిజాన్ని కొనియాడాడు. అయితే ఆయన స్వీయ భావనలలో వచ్చిన మార్పు కూడా సోషలిజంపై స్పందనను ప్రభావితం చేసిన తీరు చూస్తాం. క్రమంగా ‘కమ్యూనిజం అందరినీ వూరిస్తున్న ఒక కల’ అంటూ కాస్త విడగొట్టుకునే రీతిలో వ్యాఖ్యానించడం మొదలు పెట్టాడు. ప్రజల అవసరాలు ముఖ్యమన్నట వ్యక్తి ‘మనిషి కేవలం వాటితోనే సంతృప్తి చెందడనేది’ ప్రదానంగా ముందుకు తీసుకువచ్చారు. తనకు అపారమైన విశ్వాసం కలిగించినట్టు చెప్పిన వాడు తర్వాత కాలంలో మరో విధంగా అన్నాడు’ నా హృదయంలో దేశభక్తి పలకదు. అట్లానే కమ్యూనిస్టులు పలికే చిలకపలుకులు విని ఎప్పుడూ ఏవగింపు కలుగుతుంది.’ అన్నాడు. కమ్యూనిస్టులను మించి తనే క్యాపిటలిజాన్ని ద్వేషిస్తున్నట్టు చెప్పిన చలం ఇప్పుడు వారిపైనే ఏవగింపు కలుగుతుందని చెప్పడం విచిత్రమే. కాని జీవితపు మలిదశలో తన రచనలనుంచి తనే విడగొట్టుకున్నట్టు ప్రకటించిన వ్యక్తి గనక తొలినాటి భావాలను కూడా మార్చుకోవడం పెద్ద ఆశ్చర్యమనిపించదు. మనం చెప్పుకునేది అభిమానించేది వూగిపోయేది తొలినాటి చలం గురించి తప్ప అరుణాచలం గురించి కాదు కదా! అయితే ఏ దశలోనూ ఆయన తన వ్యాఖ్యల పరిమితులు మర్చిపోలేదు. తెలిసింది తక్కువేననీ, ఇంకా కొంతకాలం ఆగిచూడాలనీ, నిలబడటం కష్టమనీ పలు విధాలైన వివరణలు జోడించడంలో వినమ్రత తొంగి చూస్తుంది.
1990లలో సోవియట్ విచ్చిన్నం తర్వాత చలం మాటలు నిజమైనట్టు భావించే అవకాశం వుంది. సంకలనకర్త ఆ మేరకు నోట్ రాశారు కూడా. సోషలిజం మానవ చైతన్యంలో మౌలిక దీర్ఘకాలిక మార్పు తీసుకురాలేకపోవడం దానికి ఒక కారణం కూడా. అయితే సైద్ధాంతిక విషయాలలో ఆచరణలో అంతర్జాతీయ నీతిలో నాటి (గోర్బచెవ్) నాయకత్వం అనుసరించిన ఆత్మవినాశక ధోరణులు చేసిన దోహదం కూడా చాలా వుంది. ఈ రెంటిలో దేన్ని విస్మరించినా సరైన నిర్థారణలకు రాలేము. దానివల్ల సోవియట్ తూర్పు యూరప్లలో సోషలిజం కూలిపోయిన మాట నిజమే గాని అంతటితో కమ్యూనిజం కన్నా క్యాపిటలిజం గొప్పదని రుజువై పోయిందా? చలం మరణించి పుష్కర కాలం గడిచాక , సోవియట్ విచ్చిన్నమైనాక 1992లోనూ సౌరిస్ ‘ఆయనకు కమ్యూనిజంపై అమోఘమైన విశ్వాసం వుండేదని’ చెప్పడం ఆసక్తికరం. ‘ఏదైనా చేస్తే కమ్యూనిస్టులే చేయాలని’ చలం అనేవారని ఆమె చెప్పారు. జరిగిన తప్పిదాలను దిద్దుకుని సరైన దిశా నిర్దేశం చేసుకోవలసింది కమ్యూనిస్టులే అన్న చలం భావం ఇక్కడ సుస్పష్టం. ఇప్పుడు సంపన్న దేశాలలోనూ సంక్షోభాలు వస్తున్నాయన్నా- కారల్ మార్క్స్ రచనలకు గిరాకి పెరిగిందన్నా అనేక యూరప్ దేశాలలో వామపక్ష ప్రగతిశీల ప్రభుత్వాలు వస్తున్నాయన్నా కమ్యూనిస్టు సిద్ధాంతాల మౌలిక సత్తా తెలుస్తుంది.
అసలు గురు ప్రసాదరావుగారు తన ముందుమాటలో చెప్పినట్టు సోషలిజం విఫలమైందన్న వాదనే నిలిచేది కాదు. వేల ఏళ్ల దోపిడీ సమాజం సాధించిన దానితో పోలిస్తే 70 ఏళ్లు మాత్రమే మనుగడ సాగించిన సోషలిస్టు సోవియట్ సాధించింది చాలా ఎక్కువ. ఇప్పుడు చైనా అనుసరిస్తున్న విధానాలతో తేడా వున్నా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో దాని అగ్రస్థానాన్ని ఎ వరూ నిరాకరించలేరు. చైనా ఆర్థిక వొడుదుడుకులకు గురైతే( అది కూడా వ్యూహాత్మకంగానే) ఆ ప్రభావం భారత్తో సహా ప్రపంచంపై పడుతుంది. అమెరికానూ సబ్ప్రైమ్ సంక్షోభం ముంచెత్తింది. ఇండియా పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నా కార్పొరేట్ వర్గాల శాసనమే నడుస్తున్నది తప్ప ప్రజలకు మేలు జరగడం లేదు. అంతర్జాతీయ రంగంలో రెండవ ధృవంగా సోవియట్ లేకపోవడంతో దేశాలు అమెరికా కూటమి దయా దాక్షిణ్యాలపై ఆధారపడే స్థితి వచ్చింది. చలం భావాన్ని సౌరస్ చెప్పినట్టు ఏదైనా చేయగలిగితే కమ్యూనిస్టులు చేయాలి గాని పెట్టుబడిదారీ విధానమే చివరి వాక్యం కాదు. అయితే ఈ ఎదురుదెబ్బల తర్వాత 21వ శతాబ్ది సోషలిజం ఏ రూపం తీసుకుంటుంది, వివిధ దేశాల్లో వామపక్ష కమ్యూనిస్టు శక్తులు ఏ విధంగా పునస్సంఘటితమవుతాయి అన్నది చరిత్ర చెప్పాల్సిందే. సామ్రాజ్యవాద కుట్రలను ఎంతైనా విమర్శించవచ్చుగాని కమ్యూనిస్టు శిబిరం ఆత్మ విమర్శ చేసుకోవలసింది కూడా చాలా వుందనేది నిర్వివాదాంశం.
ఈ పుస్తకంలో వ్యక్తిగతంగా నన్ను అమితంగా ఆకర్షించింది తొలిరోజుల్లో కాకినాడలో మాకినేని బసవపున్నయ్యతో మాట్లాడిన డాక్టర్ జి.వీరభద్రరావు చలంపై ఆయన భావాలను పొందుపర్చడం. చలం రచనలు చదవడం వల్ల గతితార్కిక అవగాహన, తర్కం బాగా పట్టుపడతాయని మాకినేని తనతో అన్నట్టు ఆయన రాశాడు. స్త్రీ విముక్తి కోసం చలం చేసిన పోరాటం గొప్పదైనా సామాజిక సమగ్రత లేని అరాచకత్వం ఆయనలో వుందని అభ్యుదయ వాదులు భావిస్తుండేవారు. ఇదే విషయం మాకినేనిని అడిగినప్పుడు ఆయన ఈ మాటలు చెప్పారట. నిజానికి చలంపై కమ్యూనిస్టుల అంచనా ఎలా వున్నా ఆయన రచనలు స్వీకరించడానికి అవసరమైన భూమిక సిద్ధం చేసింది మాత్రం కమ్యూనిస్టు భావజాలమే. లేకపోతే ఈ సనాతన సమాజం వాటిని బతకనిచ్చేది కాదు.
కనుక చివరి రోజుల్లో చలం కాస్త భిన్నంగా మాట్లాడినా కమ్యూనిజం ఔన్నత్యానికి నీరాజనాలర్పించాడనేది ఈ పుస్తకం చెప్పే సత్యం. ఇందుకు సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట గుదిగుచ్చి ఇవ్వడం పాఠకులకు ముఖ్యంగా అభిమానులకు శ్రమ తగ్గిస్తుంది. సమాచారం పెంచుతుంది. ఈ రీత్యా గురుప్రసాదరావు అభినందనీయులు.కమ్యూనిజం విఫలమైందనే వాదనను తోసిపుచ్చుతూ అది లేవనెత్తిన అనేక అంశాలను పాలక వర్గాలు ఒప్పుకోకతప్పడం లేదని సోదాహరణంగా చెప్పారు.ఇదంతా దాని సైద్ధాంతిక విజయమని ఆయన చెప్పిన మాట యథార్థమే. ఇప్పుడు పేదలకు కొన్ని హక్కులు సంక్రమించడమూ ఉద్యోగ కార్మిక వర్గాల జీత భత్యాలూ పనిగంటలూ, ప్రభుత్వంపైనా యాజమాన్యాలపైనా ఒకింత అదుపూ ఇవన్నీ కమ్యూనిస్టులు నడిపించిన శ్రామిక ప్రజా ఉద్యమాల ఫలితాలే. ఇప్పుడు ప్రపంచీకరణ యుగంలో పనిగంటలు పెంచి రకరకాల షరతులతో పనిచేయించేందుకు అసంఘటిత రంగాన్ని పెంచుతున్నా దానిపై పోరాడుతున్నది ఆ ఉద్యమాలే. అదే సమయంలో కమ్యూనిజాన్ని సమర్థిస్తూనే చైనా వల్ల సోషలిజం దెబ్బతినిపోయిందనే ఆరోపణతో గురుప్రసాదరావు కొంత విమర్శ రాశారు. దాని నిజానిజాలు ఎలా వున్నా ఈ సంపుటితో పొసిగేది కాదనిపిస్తుంది. దాన్ని ఆయన విడిగ ారాయడం మంచిది. ఎందుకంటే వాటితో సోషలిస్టు మూల సిద్ధాంతానికి గాని చలానికి గాని సంబంధం లేదు. అవన్నీ చరిత్ర క్రమంలో వచ్చిన వాద వివాదాలు.
నాస్తికత్వంపై చలాన్ని అదేపనిగా అడిగిన వారి ఇంటర్వ్యూలు ఆయన సమాధానాలు ఇందులో చాలా వున్నాయి. కమ్యూనిస్టులకు ఆసక్తి వుంటుందనే భావంతో వాటిని ఇస్తున్నట్టు సంకలనకర్త వివరణ ఇచ్చారు కూడా. కమ్యూనిస్టులు ప్రపంచాన్ని గతితార్కిక భౌతికవాద దృష్టితో చూస్తారనేది నిజమే . ఆ రీత్యా వారు హేతువాదాన్ని బలపర్చే మాటా మూఢనమ్మకాలను వ్యతిరేకించే మాటా నిజమే. కాాని కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి గాని, దాంట్లో పనిచేయడానికి గాని నాస్తికత్వం ఒక షరతు కాదు. దేవుణ్ని విశ్వసించేవారు కూడా సభ్యులుగా చేరవచ్చని క్యూబా కమ్యూనిస్టుపార్టీ వంటిది బహిరంగంగానే తన నిబంధనావళిలో ప్రకటించింది.కమ్యూనిస్టులంటేనే దైవ దూషకులు, ద్వేషులు అన్నట్లు చేసే వ్యతిరేక ప్రచారమూ వాస్తవం కాదు. ఇటీవలనే సిపిఐ(ఎం)య అధికార పత్రిక పీపుల్స్ డెమొక్రసీ కూడా దేవుడి పట్ల విశ్వాసం వున్నవారిని తాము అనర్హులుగా పరిగణించడం లేదని వ్యాఖ్యానం వెలువడింది. 1955లో ఆంధ్రలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నాస్తికత్వం అనే ప్రచారాన్ని కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు బాగా వాడుకున్నారు. ఆ రోజుల్లో చలం కమ్యూనిస్టులు గెలవాలని కోరుకున్నారు. ఇది కూడా ఆయనకు దానిపై వున్న అభిమానాన్నే చెబుతుంది.
చివరగా చలం నాటికలు రెండు జత చేశారు. కమ్యూనిస్టు కార్యకర్తలను పెట్టుబడిదారు కుటుంబ సభ్యులు తర్కంతో తికమక పెట్టడం వీటిలో ఇతివృత్తం. చలం వాదనా పటిమనూ చమత్కారాన్ని తెలియజేసేవే గాని ఇవి పుస్తకంలోని ప్రధాన సారాంశంతో పెద్దగా పొసగడం లేదు.
చలం కలంలో కమ్యూనిజం గురించి చదవడం ఆయనకు ప్రజలపై వున్న ప్రేమను తెలియజేస్తుంది. అలాగే దేశభక్తినే నమ్మలేనన్న అలాటి వ్యక్తిలో కూడా అంతటి ఆశాభావం రేకెత్తించడం కమ్యూనిస్టు భావజాలానికి వున్న శక్తివంతమైన ప్రభావాన్ని ఒకనాడు ఈ దేశంలో దాని ప్రాభవాన్ని తెలియజేస్తుంది. సౌరిస్ చెప్పినట్టు ఆయన ఏదైనా చేస్తే కమ్యూనిస్టులే చేయాలని నమ్మారు. మరి వారు ఈ విధమైన అంచనాలను ఎలా ఏ మేరకు విజయవంతం చేస్తారన్నది వారి ఆలోచనలూ ఆచరణకు సంబంధించిన అంశం. అందుకోసం నిరీక్షించే క్రమంలో తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
– తెలకపల్లి రవి
.
